SLBC Tunnel Tragedy: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన విషాదాంతం! 8 మంది కార్మికుల డెడ్ బాడీస్ గుర్తించినట్లు ప్రచారం!
SLBC Tunnel Rescue Operation | ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల వారం రోజుల కిందట చిక్కుకున్న 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 3 మీటర్ల లోతులో మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది.

SLBC Tunnel Tragedy: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కథ విషాదాంతం అయినట్లు తెలుస్తోంది. దాదాపు వారం రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందినట్లు రెస్క్యూ టీమ్ శుక్రవారం గుర్తించింది. 3 మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నాయని, అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ టీమ్ గుర్తించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
గత శనివారం ఉదయం పనులు చేస్తుండగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కొన్ని మీటర్ల మేర కూలిపోవడం తెలిసిందే. 42 మంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా, 8 మంది మాత్రం లోపల చిక్కుకున్నారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ టీమ్స్, సింగరేణి టీమ్స్, పోలీసులు, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ లు సైతం ఎంత ప్రయత్నించినా లోపల చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి.
అసలేం జరిగిందంటే..
నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు 2005లో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించారు. మొత్తం 44 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు చేపట్టగా, ఇదివరకే పలుమార్లు అనివార్య కారణాలతో పనులు నిలిచిపోయాయి. దాదాపు 35 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించాలని పనులు వేగవంతం చేసింది. ఫిబ్రవరి 18న SLBC టన్నెల్ పనులు తిరిగి చేపట్టగా, ఫిబ్రవరి 22న ఉదయం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోవడంతో విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో టన్నెల్ పైకప్పు కూలిపోయింది.
టన్నెల్ పైకప్పు కూలిన సమయంలో లోపల 50 మంది వరకు ఉండగా, టన్నెల్ బోరింగ్ మెషిన్ కు ఇవతల వైపున ఉన్న 42 మంది ప్రాణ బయంతో పరుగులు పెట్టారు. రెండు, మూడు కిలోమీటర్లు పరిగెత్తిన అనంతరం లోకో ట్రైన్లో ప్రయాణించి టన్నెల్ నుంచి బయటకు వచ్చారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ కు అవతల వైపున చిక్కుకున్న వారు బురదలో చిక్కుకుపోయినట్లు నిపుణులు, రెస్క్యూ టీమ్ అనుమానించింది. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది, సింగరేణి టీమ్స్, పోలీసులు, ఆఖరికి ర్యాట్ హోల్ మైనర్లను సైతం తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దించింది. వారం రోజుల నుంచి ఆపరేషన్ కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

