NEET 100cr admission racket: నీట్ సీట్ల పేరుతో వంద కోట్ల దోపిడీ - ఇంత ఈజీగా మోసం చేయవచ్చా ?
NEET scam: నీట్ సీట్లు ఇప్పిస్తామని చెబితే చాలు లక్షలకు లక్షలు ఇచ్చేశారు పిల్లల తల్లిదండ్రులు. కానీ సీటు రాలేదు.. ఇటు డబ్బులూ మిగల్లేదు.

NEET scam 100cr admission racket: దేశవ్యాప్తంగా NEET మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించిన భారీ మోసం బయటపడింది. బీటెక్ గ్రాడ్యుయేట్ అభినవ్ శర్మా అనే ఇంజనీర్ రూ. 100 కోట్ల మోసం రాకెట్ను నడిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. లక్నో సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం రాత్రి కతౌటా సరస్సు సమీపంలో శర్మా , అతని సహచరుడు సంతోష్ కుమార్ను అరెస్ట్ చేశారు.
అభినవ్ శర్మా, బిహార్కు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మథురలోని ఒక సాధారణ ప్రైవేట్ కాలేజీ నుంచి 2012లో డిగ్రీ పూర్తి చేశాడు. ఢిల్లీలోని ఒక జాబ్ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఇండియాలో ఎంట్రన్స్ పరీక్షల్లో ఉన్న లోపాలను గుర్తించి, తన స్వంత 'కన్సల్టెన్సీ'ను ప్రారంభించాడు. ఈ ర్యాకెట్ ద్వారా NEETలో విఫలమైన విద్యార్థుల కుటుంబాలకు మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఒక్కొక్క కుటుంబం నుంచి రూ. 18 లక్షల నుంచి 45 లక్షల వరకు వసూలు చేసేవాడు. ఇలా రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ శర్మ మోం చేశాడు.
శర్మా గ్యాంగ్ NEET అభ్యర్థుల డేటాను ఆన్లైన్ సోర్సులు, డేటా బ్రోకర్ల నుంచి సేకరించి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఆకర్షణీయ ప్రకటనలు ఇచ్చి ఆకర్షించేది. వారిని కన్సల్టెన్సీ కార్యాలయాలకు పిలిచి, ఫేక్ డాక్యుమెంట్లు, కాలేజీల ఫోటోలు చూపించి విశ్వాసం కలిగించేవారు. చెల్లింపులు క్యాష్, డిమాండ్ డ్రాఫ్టులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ల ద్వారా 'హింద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' పేరిట తెరిచిన ఫేక్ కరెంట్ అకౌంట్లలో డిపాజిట్ చేయించేవారు. బారాబంకీ, సీతాపూర్, బిహార్లోని ప్రముఖ మెడికల్ కాలేజీల సీట్లు ఇస్తామని చెప్పేవారు. కానీ ఎవరికీ సీట్లు ఇప్పించలేదు.
శర్మా బాలీవుడ్ సెలబ్రిటీలను సెమినార్లకు ఆహ్వానించేవాడు. తాను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్గా కనిపించేవాడు. అతను ఐదు ఫేక్ ఐడెంటిటీలతో పని చేసి, పోలీస్ కస్టడీ నుంచి ఒకసారి పట్నా-సహారన్పూర్ ట్రైన్ నుంచి దూకి తప్పించుకున్నాడు. జైలులో ఉన్నప్పుడు మరొక మోసగాడు సంతోష్ కుమార్తో స్నేహం చేసి, అక్కడి నుంచే ర్యాకెట్ను నడిపించాడు.
మోసం చేసిన డబ్బుతో శర్మా భారీ లగ్జరీ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. యూరప్, నార్త్ అమెరికా, సెంట్రల్ ఆసియా, సౌత్ అమెరికా, మధ్యప్రాచ్యంలోని 110కి పైగా దేశాలకు బిజినెస్ క్లాస్లో తిరిగాడు. సెవెన్-స్టార్ హోటల్స్లో ఉండేవాడు. రూ. 5 లక్షల స్విస్ వాచ్లు, ప్లాటినం బ్రేస్లెట్లు, డిజైనర్ షూస్లు కొనుగోలు చేశాడు. ఢిల్లీ, బెంగళూరు, గోవా, కాఠ్మాండూ, దుబాయ్లో హై-ఎండ్ అపార్ట్మెంట్లలో లగ్జరీ పార్టీలు ఇచ్చేవాడు. గర్ల్ఫ్రెండ్స్కు రూ. 5-10 లక్షల విలువైన గిఫ్ట్లు ఇచ్చి, వారిని విదేశీ ట్రిప్లకు తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో తన విదేశీ పర్యటనలు, పార్టీలు పోస్ట్ చేసేవాడు. డబ్బులు కట్టి .. తమ పిల్లలకు సీట్లు రాక మోసానికి గురైన కుటుంబాలు లక్నో సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన తర్వాత రాకెట్ బయటపడింది. దర్యాప్తులో శర్మాపై 18కి పైగా కేసులు ఉన్నట్టు తేలింది.





















