Pawan Kalyan: అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ ముజామిల్ అరెస్ట్.. కింగ్ పిన్స్ వేట మొదలైంది: పవన్ కళ్యాణ్
శేషాచలం నుంచి బెంగళూరు మీదుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ను ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Red Sandalwood Smuggling | చిత్తూరు: ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల వేట మొదలైందని, వారి వెనకున్న కింగ్ పిన్లను సైతం త్వరలో ఏరివేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ను ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ టీమ్ అరెస్టు చేసింది. ఈ కింగ్ పిన్ ఎర్రచందనం దుంగలను లైసెన్స్ పేరు చెప్పి అక్రమంగా చైనాకి తరలించేవాడు. శేషాచలం నుంచి బెంగళూరు మీదుగా రవాణాకు పాల్పడేవాడు. ముజామిల్ మీద గతంలోనే అనేక కేసులు ఉండగా, 87 శాతం కేసుల్లో శిక్షలు కూడా ఖరారయ్యాయి. అయితే అప్పటి నుంచి ఇతడు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ పై కూటమి సర్కార్ ఉక్కుపాదం..
ఎర్ర చందనం స్మగ్లర్లు, వారి వెనక ఉన్నవారిపై ఉక్కు పాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందం కింగ్ పిన్స్ వేట మొదలుపెట్టింది. ఈ వేటలో భాగంగా శనివారం ఉదయం చిత్తూరు - నాయుడుపేట జాతీయ రహదారిపై అడిషనల్ ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలోని బృందం ముజామిల్ను పట్టుకుంది.
చైనా కంపెనీలతో లింకులు
విచారణలో ఇతనికి చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఎర్రచందనం అక్రమ రవాణాకి పాల్పడే వారి పట్ల ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరిస్తుందని, కింగ్ పిన్స్ ఎవరైనా ఉంటే లొంగిపోవాలని గత చిత్తూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కింగ్ పిన్స్ ఏ మూలన దాగి ఉన్నా పట్టుకుంటామని అప్పట్లోనే స్పష్టం చేశారు. ఆ ఆదేశాల మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన యాంటి రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ బృందం మొదటి విజయం సాధించింది.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్య సాధనలో ఇది కీలక అడుగు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ హెడ్ ఎస్పీ సుబ్బారాయడు, అడిషనల్ ఎస్పీ కులశేఖర్, ఇతర సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదే విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు, వారి వెనకున్న కింగ్ పిన్లను త్వరలో అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
























