Instagram Love Tragedy: ఇన్స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
Woman and Lover Commit Suicide in Eluru | ఇన్స్టాగ్రామ్ పరిచయం ప్రేమగా మారింది. వివాహితను ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తమను వీడదీస్తున్నారని ఇద్దరూ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఉంగుటూరు: సోషల్ మీడియా పరిచయం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి, చివరకు ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటనలో కన్నబిడ్డలను, భర్తను వదిలేసి వచ్చిన ఒక మహిళ, తన ప్రియుడితో కలిసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఏలూరు జిల్లాలో ఈ విచిత్రకరమైన ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామ సమీపంలోని యర్రమళ్లకు చెందిన మావుళ్లయ్యకు, శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన రమతో రెండేళ్ల కిందటే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. రమకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వీరిద్దరి ఇన్స్టా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరకు వివాహేతర సంబంధానికి దారితీయడంతో సమస్య మొాదలైంది. ఇటీవల రమ తన కుటుంబాన్ని వదిలి మావుళ్లయ్య ఊరికి వచ్చేసింది. అక్కడ వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న రమ కుటుంబ సభ్యులు యర్రమళ్లకు వచ్చి గొడవ పడటంతో పాటు, ఆమెను బలవంతంగా సొంత ఊరు యర్రమళ్లకు తీసుకెళ్లారు.
కాలువలో దూకి ఆత్మహత్య
కుటుంబ సభ్యులు తీసుకెళ్లినప్పటికీ, తన ప్రియుడ్ని విడిచి ఉండలేక రమ మళ్లీ తిరిగి రావడంతో మావుళ్లయ్య ఆమెను సీక్రెట్గా ఉంగుటూరులో ఓ గదిలో ఉంచాడు. ఈ నెల 24న తన అన్న కుమారుడు సతీష్2కు ఫోన్ చేసి రమ వచ్చిన విషయం చెప్పిన మావుళ్లయ్య, అక్కడికి వస్తే ఏం చేయాలో మాట్లాడదాం అని పిలిచాడు. ఆ తర్వాత ఆమెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నాన్న మావూళ్లయ్యను కలిసేందుకు వచ్చిన సతీష్కు నాచుగుంట కాలువ గట్టుపై మావుళ్లయ్య వస్తువులు కనిపించడంతో అనుమానం వచ్చి బంధువులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం మావుళ్లయ్య మృతదేహం లభ్యమైంది.
రమ కూడా కనిపించడం లేదని, ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని భావించి ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో గాలించగా చేబ్రోలు సమీపంలో రమ మృతదేహం లభ్యమైంది. ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఈ ఘటనతో అటు మావుళ్లయ్య తల్లిదండ్రులు కుమారుడు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు రమ ఇద్దరు చిన్నారులు తల్లిలేని వారయ్యారు. సోషల్ మీడియాలో ఏర్పడే అపరిచిత బంధాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.























