Nizamabad: సర్పంచ్ పోటీకి అనర్హుడు కాకూడదని బిడ్డను చంపేసిన తండ్రి - ఇలాంటి నాన్నలు కూడా ఉంటారు !
Father killed daughter: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు ఆయన. కానీ తనకు ముగ్గురు పిల్లలు. అలా ఉంటే పోటీకి అనర్హం. అందుకే ఓ బిడ్డను చంపేశాడు.

Father killed daughter for Sarpanch Post: అధికారంపై వ్యామోహం మనిషిలోని మానవత్వాన్ని చంపేయడమే కాదు, కన్న కూతురినే బలి తీసుకునేలా ప్రేరేపించిన కిరాతక ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కేవలం సర్పంచ్ పదవికి అనర్హుడు కాకూడదనే స్వార్థంతో, ఒక తండ్రి పక్కా స్కెచ్తో తన కూతురిని ప్రాణాలతో కాలువలోకి తోసి హత్య చేసిన వైనం సమాజాన్ని నివ్వెరపరుస్తోంది.
మహారాష్ట్రలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న పాండురంగ
మహారాష్ట్రకు చెందిన పాండురంగ అనే వ్యక్తికి రాజకీయాల్లో ఎదగాలనే బలమైన కోరిక ఉంది. గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయలని అనుకుంటున్నాడు. అయితే, అక్కడి ముగ్గురు పిల్లల నిబంధన అతనికి అడ్డుగా మారింది. ఈ అడ్డంకిని తొలగించుకోవడానికి అతను ఎంచుకున్న మార్గం అత్యంత హేయమైనది. తన ముగ్గురు సంతానంలో ఒకరు తగ్గిపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే ఉద్దేశంతో, ప్రస్తుత సర్పంచ్ గణేష్తో కలిసి క్రిమినల్ కుట్ర పన్నాడు. పక్కా వ్యూహం ప్రకారం, తన పెద్ద కూతురు ప్రాచీని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి సమీపంలోని నిజాం సాగర్ కెనాల్ వద్దకు తీసుకువచ్చాడు.
ముగ్గురు పిల్లల నిబంధన తప్పించుకోవడానికి ఓ బిడ్డ హత్య
సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకున్న పాండురంగ, పన్నెండేళ్ల ఆ బాలిక తనను కాపాడమని ప్రాధేయపడుతున్నా కనికరం లేకుండా ప్రవహిస్తున్న కెనాల్లోకి తోసేశాడు. బతికి ఉండగానే నీటిలోకి నెట్టడంతో, ఆ చిన్నారి ఊపిరి ఆడక జలసమాధి అయింది. ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, పోలీసుల నిశిత దర్యాప్తులో అసలు మోటివ్ బయటపడింది.
నిజామాబాద్ తీసుకొచ్చి కెనాల్లో తోసేసిన తండ్రి
కెనాల్లో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం కేసును ఛేదించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిచారు. ఘటనా స్థలంలో నిందితుల మొబైల్ సిగ్నల్స్, సరిహద్దు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. లోతైన విచారణలో పాండురంగ తన నేరాన్ని అంగీకరించాడు. కేవలం రాజకీయ పదవి కోసం కన్న కూతురిని అంతం చేయడమనే ఈ క్రూరమైన చర్య పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
పోలీసుల విచారణలో బట్టబయలైన కిరాతకం
ఈ కేసులో ప్రధాన నిందితుడు పాండురంగతో పాటు, హత్యకు ప్రేరేపించి సహకరించిన కేరూరు సర్పంచ్ గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీలోని హత్య, కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అధికారం కోసం పన్నెండేళ్ల బాలిక ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. స్వార్థం కోసం కన్నపేగును తెంచుకున్న ఈ తండ్రికి కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.























