Hyderabad ATM Scam: హైదరాబాద్లో ఏటీఎంలో పెట్టాల్సిన 1.2 కోట్ల నగదు మాయం, పరారీలో ఇద్దరు ఉద్యోగులు!
ATM Cash Theft In Hyderabad | ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ నగదు గోల్మాల్ కలకలం రేపుతోంది. ఏటీఎంలలో జమ చేయాల్సిన సుమారు రూ.1.20 కోట్ల నగదు మాయమైంది.

హైదరాబాద్లోని ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ATM నగదు గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలలో జమ చేయాల్సిన సుమారు రూ.1.20 కోట్ల నగదు మాయమవ్వడం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్కు చెందిన సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ (CMS Info Systems Ltd) అనే సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును సేకరించి ఏటీఎంలలో నింపుతుంటుంది. అయితే, తాజాగా నిర్వహించిన ఆడిటింగ్లో ఎస్సార్నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేయగా, అందులో 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.1,20,98,500 నగదు లెక్క తేలకపోవడంతో సంస్థ బ్రాంచ్ మేనేజర్ నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఆర్థిక నేరంలో ఏటీఎంలలో నగదు నింపే ఇద్దరు కస్టోడియన్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఉద్యోగులు ప్రస్తుతం విధులకు హాజరుకాకపోవడమే కాకుండా, వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం మరింత బలపడింది. వీరిద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఏటీఎంల నుంచి నగదును కాజేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కోటి రూపాయలతో పరారయ్యారా?
ఏటీఎంలలో జమ చేయాల్సిన సుమారు ₹1 కోటి నగదుతో ఒక క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు పరారయ్యారు. నిందితులను వాసిరెడ్డి మరియు లతీఫ్లుగా గుర్తించారు. సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ఏజెన్సీకి చెందిన బోయిన్పల్లి కార్యాలయం నుండి ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతను వీరికి అప్పగించారు, అయితే గత రెండు రోజులుగా వారు కనిపించడం లేదు. మరోవైపు సాధారణంగా జరిగే ఆడిటింగ్ సమయంలో వారు లేకపోవడంతో కంపెనీలో అనుమానం మొదలైంది. సంస్థ అంతర్గతంగా జరిపిన విచారణలో ఎస్సార్ నగర్ ప్రాంతంలోని కనీసం 8 ఏటీఎంలలో నగదు జమ కాలేదని వెల్లడైంది.
ట్రెండింగ్ వార్తలు





















