Bapatla Crime News: పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు- బాపట్లలో దారుణం
Andhra Pradesh Bapatla Crime News: బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేుకుంది. పదో తరగతి విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించగా.. అతడు చనిపోయాడు.
Bapatla Crime News: రోజూలాగే ట్యూషన్ కు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతడు కేకలు వేయడం గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే విద్యార్థిని స్నేహితులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలానికి చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ ఉదయం రాజోలులో ట్యూషన్ కు వెళ్తున్నాడు. రోజూలాగే శుక్రవారం రోజు ఉదయం కూడా ట్యూషన్ కు వెళ్తుండగా.. మార్గం మధ్యలో రెడ్లపాలెం వద్ద గుర్తు తెలియని దుండగులు బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకోవడంతో అమర్నాథ్ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. అది విని విషయం గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కానీ ఆలోపే అమర్నాథ్ మృతి చెందాడు. అయితే విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తమ కుమారుడి మృతికి కారణం అయిన వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే అమర్నాథ్ చనిపోయేకంటే ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో తన స్నేహితులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా తోటి విద్యార్థి వెంకటేశ్వర్ రెడ్డి, మరికొందరు స్నేహితులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు అమర్నాథ్ వివరించాడని.. ఈక్రమంలోనే పోలీసుల వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.