ఈ పోలీసాయన ఏం చేశాడో తెలుసా? కారు ఛార్జింగ్ కోసం ఏకంగా ట్రాన్స్ఫార్మర్కే కనెక్ట్ చేశాడు
రాజస్థాన్లో ఓ పోలీసు కానిస్టేబుల్ ట్రాన్స్ఫార్మర్ పాయింట్ నుంచి నేరుగా Tata Nexon EV ఛార్జ్ చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఇది భద్రత, చట్టపరమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Tata Nexon EV Charging At Transformer News: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న వేళ, వాటి ఛార్జింగ్ విషయంలో పాటించాల్సిన నిబంధనలను పట్టించుకోకపోతే ఎంత ప్రమాదమో చూపించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ సంఘటన జరిగిందని చెబుతున్న ఈ వీడియోలో, ఓ పోలీసు కానిస్టేబుల్ తన వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఏకంగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న విద్యుత్ పంపిణీ పాయింట్కే కనెక్షన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో, యూనిఫాం ధరించిన పోలీసు కానిస్టేబుల్, తెలుపు రంగు Tata Nexon EVని ఓ పవర్ పోల్కు కనెక్ట్ చేస్తూ కనిపించాడు. ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి తాత్కాలిక వైర్ ద్వారా వాహనాన్ని ఛార్జ్ చేస్తున్నట్లు దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. ఆ కారు నిజంగా ఆ పోలీసు కానిస్టేబుల్దేనా? లేక ఇంకెవరిదైనా అన్న విషయం ఇప్పటి వరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు.
స్థానికులు ఈ సంఘటనను గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా అన్ని వివరాలను ధృవీకరించలేకపోయామని పేర్కొంది. అయినా, వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భద్రత పరమైన ప్రమాదాలు
నిపుణుల మాటల్లో చెప్పాలంటే, ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి నేరుగా EV ఛార్జింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు హై ఓల్టేజ్ కరెంట్ను కలిగి ఉంటాయి. ఇవి నేరుగా వాహనాల ఛార్జింగ్కు అనుకూలంగా ఉండవు. నియంత్రిత ఓల్టేజ్, ఫ్రీక్వెన్సీ అందించే ప్రత్యేక EV ఛార్జింగ్ యూనిట్ లేకుండా ఛార్జ్ చేస్తే, వాహనంలోని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆన్బోర్డ్ ఛార్జర్కు తీవ్ర నష్టం కలగొచ్చు.
ఓల్టేజ్లో హెచ్చుతగ్గుల కారణంగా షార్ట్ సర్క్యూట్లు లేదా అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో లైవ్ కనెక్షన్లను హ్యాండిల్ చేయడం వల్ల విద్యుత్ షాక్ ప్రమాదం కూడా తీవ్రంగా ఉంటుంది.
నిబంధనలు ఏమంటున్నాయి?
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ట్రాన్స్ఫార్మర్లకు కనీసం 15 మీటర్ల దూరంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ను ఛార్జ్ చేయకూడదు. సురక్షితం కాని ఛార్జింగ్ వల్ల హార్మోనిక్స్ ఏర్పడి, అదే నెట్వర్క్కు కనెక్ట్ అయిన ఇతర విద్యుత్ పరికరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఓవర్లోడింగ్ సమస్య
ఎలక్ట్రిక్ వాహనాలు నిరంతరంగా ఎక్కువ కరెంట్ను వినియోగిస్తాయి. ఇది ఇప్పటికే లోడ్తో ఉన్న ట్రాన్స్ఫార్మర్పై అదనపు భారం వేస్తుంది. దీని వల్ల ట్రాన్స్ఫార్మర్ ఓవర్హీట్ కావడం, ఫ్యూజ్లు దెబ్బతినడం, స్థానికంగా కరెంట్ అంతరాయం ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తొచ్చు.
చట్టపరమైన అంశాలు
చట్టపరంగా కూడా ఇది తీవ్రమైన నేరమే. భారత విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 135 ప్రకారం, అనుమతి లేకుండా విద్యుత్ లైన్ల నుంచి కనెక్షన్ తీసుకోవడం లేదా మీటర్ను బైపాస్ చేయడం విద్యుత్ చోరీగా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు, పొందిన ఆర్థిక లాభానికి మూడు రెట్లు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. EVల వినియోగం పెరుగుతున్న ఈ సమయంలో, భద్రత నిబంధనలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.























