Rats Bite Students: కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
A Konduru KGBV School in NTR District | ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులోని కస్తూర్భా పాఠశాలలో 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. మంత్రి సత్యకుమార్ సైతం ఈ ఘటనపై స్పందించారు.

ఎ.కొండూరు: ఏపీలో మరో గవర్నమెంట్ హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం (ఫిబ్రవరి 11న) రాత్రి డార్మెటరీలో విద్యార్థినులు నిద్రిస్తుండగా ఉండగా, కిటికీల ద్వారా లోపలికి వచ్చిన ఎలుకలు వారిపై దాడి చేశాయి. ఏడో తరగతి చదువుతున్న కావూరి కళావతి, మాల్లాది శ్యామల, చిమటా లక్ష్మీప్రసన్న, వి స్నేహ, ఎం. రజిని సహా మొత్తం 12 మంది బాలికలను ఎలుకలు కరిచాయి.
కేజీబీవీని సందర్శించిన ఉన్నతాధికారులు
ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా KGBV అధికారులు తొలుత గోప్యంగా ఉంచడానికి చూశారు. అయితే, గురువారం ఉదయం ఎలుకలు కరిచిన బాధిత బాలికలను చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించడంతో విషయం బయటపడింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మార్వో ఎన్. అరవింద్, ఎంపీడీవో బి. శ్రీనివాసరావు, జీసీడీవో విశ్వభారతి వెంటనే కస్ఫూర్బా గాంధీ స్కూల్ (KGBV), హాస్టల్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థినుల నుంచి స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.
హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరవడం కేజీబీవీలో వసతుల లేకపోవడాన్ని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని చూపుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ డార్మెటరీ కిటికీలు సరిగా లేకపోవడం వల్లే ఎలుకలు లోపలికి వచ్చాయని విద్యార్థినులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో విద్యార్థులకు చికిత్స అందించాల్సిన ఏఎన్ఎం పోస్టు గత ఏడాది నుంచి ఇక్కడ ఖాళీగా ఉంది. అంటే అకస్మాత్తుగా విద్యార్థులు ఏమైనా అస్వస్థతకు గురైనా వారికి త్వరగా చికిత్స అందించే అవకాశం కూడా లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సైతం డార్మెటరీలోకి ఇదే విధంగా ఎలుకలు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
ఈ ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. బాలికలకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.




















