CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Devotee Narayana: సిపిఐ సీనియర్ నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారి విధానం ప్రకారం దేవుడు ఉండడు. దీనిపై బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మార్పు మంచిదేనని స్పందించారు.

BJP Vishnu reacts to CPI leader Narayana : దశాబ్దాల కాలంగా మార్క్సిస్ట్ సిద్ధాంతాలను, నాస్తికవాదాన్ని నమ్ముతూ, మతం ఒక మత్తుమందు అన్న కార్ల్ మార్క్స్ మాటలను తు.చ తప్పకుండా పాటించిన సీపీఐ అగ్రనేత డాక్టర్ కె. నారాయణలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ హేతువాద దృక్పథంతో దేవుడి ఉనికిని ప్రశ్నించే ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టు నేత, స్వయంగా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటనే చర్చ మొదలైంది.
గడప బయట నుంచి గర్భాలయం వరకు
గతంలో అనేకసార్లు నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చినప్పటికీ, వారు దర్శనం చేసుకునే సమయంలో ఆయన ఆలయం వెలుపలే వేచి ఉండేవారు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా ఆయన భక్తితో స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా, తిరుమల లడ్డూ వివాదంపై కూడా సానుకూలంగా స్పందించారు. లడ్డూ కల్తీ జరిగిందన్నది నిజమని, అయితే దీనిపై కేవలం రాజకీయ ప్రచారం చేయడం కంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. వయసు మళ్లిన తరుణంలో ఆయన ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందా లేక ఆధ్యాత్మికత పట్ల సానుకూలత పెరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది గొప్ప జ్ఞానోదయం బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి
నారాయణ ఆధ్యాత్మిక బాట పట్టడంపై బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు యస్. విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల పాటు దేవుడు లేడు అని నమ్మిన సిద్ధాంతం నుంచి, వయసు మళ్లిన తర్వాత అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అనే ఆధ్యాత్మిక బాటలోకి రావడం ఒక గొప్ప జ్ఞానోదయం అని ఆయన పేర్కొన్నారు. మార్క్సిస్ట్ గ్రంథాలు చదివినా దొరకని ప్రశాంతత, వేంకటేశ్వరుడి పాదాల చెంత దొరుకుతుందని నారాయణ గ్రహించడం శుభపరిణామమని ఆయన కొనియాడారు.
మార్పు మంచిదే!
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) February 12, 2026
దశాబ్దాల పాటు "దేవుడు లేడు" అని నమ్మిన సిద్ధాంతం నుంచి, వయసు మళ్ళిన తర్వాత "అంతా ఆ దేవుడే చూసుకుంటాడు" అనే ఆధ్యాత్మిక బాటలోకి రావడం ఒక గొప్ప జ్ఞానోదయం! సీపీఐ నారాయణ గారు శ్రీవారిని దర్శించుకుని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం శుభపరిణామం.
మార్క్సిస్ట్ గ్రంథాలు ఎంత… https://t.co/QgG5VOwzYm
నాస్తికత్వం కేవలం యవ్వనపు ఆవేశమేనా?
విష్ణువర్ధన్ రెడ్డి తన విశ్లేషణలో నాస్తికత్వం అనేది కేవలం యవ్వనపు ఆవేశం మాత్రమేనని, వయసు పెరిగే కొద్దీ ఆ పరమాత్ముని ఉనికిని కాదనలేమని ఈ దర్శనం నిరూపిస్తోంది. ఇది కేవలం రాజకీయ మలుపు కాదు, ఆత్మ కనుగొన్న సత్యం అని అభివర్ణించారు. గతంలో గద్దర్, శ్రీశ్రీ, రాహుల్ సాంకృత్యాయన్ వంటి విప్లవ దిగ్గజాలు కూడా చివరి దశలో ఆధ్యాత్మిక లేదా సత్యం వైపు పయనించారని ఆయన గుర్తు చేశారు.























