![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!
Tirumala News: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతుండగా.. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. గ్యాలరీ మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది.
![Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం! Huge Devotees Rush At Tirumala Srivari Brahmotsavam 2023 Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/6848cb758dca73c984d293ab62a2257d1695369522801519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirumala Brahmotsavam 2023: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన 5వ రోజుకు వార్షికోత్సవాలు చేరుకున్నాయి. స్వామి వారు నేడు రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇవనున్నారు. గరుడ వాహనంపై విహరించనున్న శ్రీవారికి మూల విరాట్టుకు అలంకరించే సహస్ర నామాల మాల, లక్ష్మీ కాసుల మాల, పచ్చల హారం స్వామి వారికి అలంకరిస్తారు. అలాగే పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడిని అవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామి వారు భక్త కోటికి తెలియజేస్తున్నాడు. అందుకే శ్రీవారిని గరుడ వాహనం రోజు దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు.
తిరుమలకు పోటెత్తిన భక్తులు, నిండుకుండల్లా మారిన గ్యాలరీలు
గరుడవ వాహన సేవ జరుగుతున్న నేపథ్యంలో ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలు నిండు కుండల్లా మారుతున్నాయి. ఇప్పటికే గ్యాలరీలలో లక్ష మైందికి పైగా భక్తులు చేరుకున్నారు. తిరుమలలో ఎటు చూసినా భక్తుల కోలాహలమే కనిపిస్తోంది. ఆలయ మాడ వీధుల్లోనూ, ఔటర్ రింగ్ రోడ్డుల్లోకి భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. ఇక తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిండి తిరుమలకు చేరుకుంటున్నాయి. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ సాగుతూ వస్తుంది. చంటి పిల్లలకోసం పాలను సైతం టీటీడీ గ్యాలరీలలో అందిస్తుంది.
ఇక 3 లక్షలకు పైగా గరుడ వాహన సేవకు భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మరింత మంది సామాన్య భక్తులకు గరుడ వాహన సేవ దర్శన భాగ్యం కల్పించేందుకు రీఫిల్లింగ్ వ్యవస్థను అందుబాటులోకి టీటీడీ తీసుకొచ్చింది. గరుడ సేవ సందర్భంగా గురువారం సాయంత్రం నుండి ద్విచక్ర వాహనాల అనుమతిని టీటీడీ రద్దు చేసింది. గరుడ వాహన సేవకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే దృష్ట్యా 5 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన టీటీడీ కమాండ్ కంట్రోలు రూంలో అధికారులు భద్రతను పర్యవేక్షించనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అయితే ఔదో రోజులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనం ఇచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయం ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)