Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం

హైదరాబాద్: త్వరలో నాగర్కర్నూలు జిల్లా సోమశిల వద్ద కృష్ణా నదిపై నిర్మించాలని చూస్తున్న ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ వంతెన ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక అడ్డంకి తొలగిపోయింది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన సుమారు 60 ఎకరాల (24.66 హెక్టార్లు) అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-167కే విస్తరణలో భాగంగా ఈ భూమి వినియోగానికి సంబంధించి ఫిబ్రవరి చివరి వారంలో చెన్నైలో జరిగిన ప్రాంతీయ స్థాయి సమావేశంలో స్టేజ్-1 అనుమతులు మంజూరయ్యాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ, కృష్ణా నదిపై దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ కేబుల్ స్టేడ్ (ఐకానిక్) బ్రిడ్జిని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం పూర్తయితే, హైదరాబాద్ - తిరుపతి మధ్య ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఇది ప్రయాణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపిరి పోస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రకృతి సౌందర్యంలో ఆకట్టుకుంటున్న సోమశిల..
తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న సోమశిల, ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మికతకు నెలవైన ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కృష్ణా నది ఒడ్డున వెలసిన ఈ గ్రామం, చుట్టూ దట్టమైన నల్లమల అడవులు, కొండలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇక్కడ ప్రాచీనమైన లలిత సోమేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి. ఈ ఆలయంలోని ప్రతిష్టించిన లింగాలు, శిల్పకళా చాతుర్యం పర్యాటక ఆకర్షణలుగా నిలుస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (నీటి నిల్వ) కారణంగా ఇక్కడ నది సముద్రంలా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిర్మించిన కాటేజీలు, బోటింగ్ సౌకర్యాలు ఈ ప్రాంతాన్ని ఒక వీకెండ్ పిక్నిక్ స్పాట్గా మార్చాయి.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)























