MLC Driver Subrahmanyam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం! అజ్ఞాతంలోకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు! అసలేం జరుగుతోంది?
MLC Driver Subrahmanyam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం నిప్పులు చెరిగింది.

MLC Driver Subrahmanyam Murder Case:వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు మరోసారి హాట్టాపిక్ అవుతోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ హత్య కేసులో తన భార్య పాత్ర కూడా ఉందని సిట్ తేల్చడంతో ఎమ్మెల్సీ అనంత బాబు అజ్ఞాతంలోకి వెళ్లడం సంచలనంగా మారింది. ఈ కేసులో అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది? సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఏంటీ?
మీ వల్ల కాకాపోతే చెప్పండి! సుప్రీంకోర్టు ఆగ్రహం
డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం నిప్పులు చెరిగింది. కేసును దర్యాప్తు చేసి ఒక కొలిక్కి తీసుకురావడం రాష్ట్ర పోలీసుల వల్ల కాదంటే చెప్పండి, వెంటనే సీబీఐకి అప్పగిస్తామని ఘాటుగా కామెంట్ చేసింది. నిందితుడికి మేలు చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు భావించింది. ముఖ్యంగా నిందితుడికి డీఫాల్డ్ బెయిల్ వచ్చేలా వరకు ఆగి, ఆ తర్వాతే ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
హత్య జరిగిన టైంలో తప్పు చేసిన పోలీసుపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది ధర్మాసనం. అసలు డీజీపీ, ఏస్పీలు, ఏం చేస్తున్నారని కోర్టు నిలదీసింది. నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు ఉందని కామెంట్స చేసింది.
నవంబ్ డెడ్లైన్- హైకోర్టు పర్యవేక్షణ
ఈ కేసును సాగదీయడం ఇక కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్ 18 లోపు ట్రయల్ పూర్తి చేయాలని కోర్టును ఆదేశించింది. విచారణ ప్రక్రియను హైకోర్టు పర్యవేక్షించాలని, రోజువారీ విచారణ జరిగేలా చూడాలని సూచించింది. మార్చి 31లోపు ఒక ప్రత్యేక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని కూడా కోర్టు హైకోర్టును ఆదేశించింది. కేసు విచారణకు అడ్డంకులు కలిగేలా ఎలాంటి స్టేలు ఇవ్వకూడదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
సీన్లోకి ఎమ్మెల్సీ భార్య- అజ్ఞాతంలోకి అనంతబాబు
ఈ కేసులో తాజాగా మరో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. దళిత యువకుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో అనంత బాబుతోపాటు ఆయన భార్య అనంత లక్ష్మి దుర్గ కూడా పాల్గొన్నారని సిట్ నిర్ధారించింది. ఈ హత్యకు ఆమె ప్రేరేపించడమే కాకుండా, నేరంలో అన్ని విధాలా సహరించిందని సిట్ ఛార్జిషీట్లో పేర్కొంది.
తన భార్యపై ఛార్జిషీట్ దాఖలైందని తెలియగానే, ఎమ్మెల్సీ అనంత బాబు హుటాహుటిన అజ్ఞాతంలోకి వెళ్లారు. శాసనమండలిలో ఉన్న ఆయన, కనీసం గన్మెన్లను గానీ, వ్యక్తిగత సిబ్బందిని కానీ తీసుకోకుండా అర్ధంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. భార్యను అరెస్టు కాకుండా కాపాడుకునేందుకు ఆయన ఇలా చేశారని సమాచారం. ప్రస్తుతం పోలీసుల లక్ష్మీదుర్గ కోసం గాలిస్తున్నారు.
అసలు కేసు ఏంటీ?
2022 మే19న తేదీన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతబాబే స్వయంగా ఆ మృతదేహాన్ని తన కారులో తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే తమ కొడుకును ఎమ్మల్సీ చంపేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ కేసు పెద్ద మలుపు తిరిగింది. ఆ తర్వాత పోలీసులు అనంతబాబును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు.























