వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు భార్య అనంత లక్ష్మి దుర్గ అలియాస్ రోజాను ఈ కేసులో రెండో నిందితురాలిగా చేర్చారు. ఆమె హత్యకు సహకరించడమే కాకుండా, సాక్ష్యాలను తారుమారు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించింది.
East Godavari News: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక మలుపు! ఏ-2గా అనంత బాబు భార్య!
East Godavari News: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో అనంతబాబు భార్య పాత్ర ఉందని సిట్ విచారణలో తేలింది.

East Godavari News: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఆయన భార్య అనంత లక్ష్మి దుర్గ అలియాస్ రోజా పాత్ర కూడా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్దారించింది. ఈ హత్యకు ఆమె కేలవం సహకరించడమే కాకుండా, సాక్ష్యాలను తారుమారు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించిందని సిట్ తేల్చి చెప్పింది. దీంతో ఆమెను ఈ కేసులో రెండో నిందితురాలిగా చేరుస్తూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.
అసలేం జరిగింది? ఆ రాత్రి ఏం మాయం చేశారు?
ఈ కేసు వెనుక ఉన్న దారుణమైన నిజాలను సిట్ అధికారులు వెలికి తీశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ఈ కేసును మొక్కుబడిగా విచారించారని కీలకమైన సాంకేతిక ఆధారాలను వదిలేశారని కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో గత ఏడాది జులైలో సిట్ ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్, కాల్ రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు ఆధారంగా రోజా పాత్రను నిర్ధారించారు.
హత్య జరిగిన రోజున రాత్రి రోజా అనంతబాబుతో కలిసి కారులో ప్రయాణించారని, మృతదేహాన్ని తరలించే సమయంలో కూడా ఆమె వాహనంలో ఉన్నారని సీసీ ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది. గతంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని ఆమె ఇచ్చిన వాంగ్మూలం పచ్చి అబద్ధమని, ఆమె ఆ సమయంలో హత్య జరిగిన ప్రదేశంలోనే ఉన్నట్టు సిట్ అధికారులు నిరూపించారు.
హత్యకు కారణం కేవలం 20 వేల బాకీ?
సుబ్రహ్మణ్యం సుమారు ఆరేళ్లపాటు అనంతబాబు వద్ద డ్రైవర్గా పని చేశాడు. తన పెళ్లి ఖర్చుల కోసం అనంత బాబు దగ్గర యాభై వేలు అప్పుగా తీసుకున్నాడు. అందులో 30 వేలు తిరిగి చెల్లించాడు. మిగిలిన ఇరవేల కోసం అనంతబాబు కక్ష పెంచుకున్నారని సమాచారం. హత్యకు మూడు నెలల ముందే సుబ్రహ్మణ్యం పని మానేయడం వారికి మరింత ఆగ్రహం కలిగించింది. ఒకానొక సందర్భంలో అనంతబాబు ఫోన్ చేసి, డబ్బులు ఇవ్వకపోతే కాళ్లు చేతులు నరికేస్తా అని సుబ్రహ్మణ్యం తండ్రిని బెదిరించారని అంటున్నారు.
పుట్టిన రోజున వేడుక- ఆ పై హత్య!
2022 మే 19 అనంత బాబు పుట్టిన రోజు. ఆ రాత్రి తన ప్లాట్లో భార్యతో కలిసి ఆయన ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. వేడుక ముగిసిన తర్వాత రాత్రి 10.15గంటల సమయంలో బయటకు వచ్చిన అనంతబాబు, సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి మద్యం తాగతున్న చోటికి వెళ్లి, తన ఐ20 కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు.
హత్యకు ముందు లక్ష్మీ దుర్గ తన అపార్ట్మెంట్ వాచ్మెన్ కూతురిని ఒక పెద్ద కర్ర కావాలని అడగం, ఆమె లేదనడంతో తీవ్ర ఒత్తిడి చేయడం వంటి విషయాలను సిట్ గుర్తించింది. ఆ రాత్రి 10.37 గంటల సమయంలో కాకినాడ వీవీ కుమార్ గెస్ట్ హౌస్ సమీపంలోని చీకటి ప్రేశంంలో సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్టు ఆధారాలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ హత్యకు ముందు, ఆ తర్వాత అనంతబాబు, రోజూ నాలుగైదు సార్లు దుస్తులు మార్చుకుని హడావుడిగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
హత్య చేసిన తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా మార్చేందుకు అనంతబాబు పకడ్బందీగా ప్లాన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి, నాగమల్లి తోట దగ్గర ప్రమాదం జరిగిందని, ఆసుపత్రికి తీసుకెళ్లుమన్నానని అబద్ధం చెప్పారు. తీరా చూస్తే ఆ సమయంలో ఆయన లొకేషన్ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డు ప్రాంతంలో ఉంది. చివరకు మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటి మముందు పడేసి, ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేసేస్తే రెండు లక్షలు ఇస్తానని కుటుంబ సభ్యులను బెదిరించారు. బాధితులు ఎదురు తిరగడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసులు ఈ కేసును సరిగా విచారించలేదని, బాధితుల తరఫున న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు. ప్రధాన నిందితుడిని కాపాడేందుకు సాంకేతి ఆధారాలను సేకరించకుండా వదిలేశారని సిట్ విచారణలో తేలింది. ప్రస్తుతంం లక్ష్మీదుర్గకు నోటీసులు పంపినప్పటికీ, ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి పరారీలో ఉన్నారు. ఈమెకు సమాచారం లీక్ చేసిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిట్ సూచించింది.
Frequently Asked Questions
దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్తగా ఎవరిని నిందితులుగా చేర్చారు?
సుబ్రహ్మణ్యం హత్యకు అసలు కారణం ఏమిటి?
సుబ్రహ్మణ్యం తన పెళ్లి ఖర్చుల కోసం అనంత బాబు దగ్గర తీసుకున్న యాభై వేల రూపాయలలో మిగిలిన ఇరవేల రూపాయలు ఇవ్వకపోవడమే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం పని మానేయడం కూడా వారి ఆగ్రహానికి కారణమైంది.
హత్య జరిగిన రోజున ఏమి జరిగింది?
అనంత బాబు పుట్టినరోజు వేడుకల తర్వాత, సుబ్రహ్మణ్యాన్ని తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. హత్య జరిగిన ప్రదేశంలో, సాక్ష్యాలు తారుమారు చేయడంలో రోజా పాత్ర ఉందని సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
హత్య తర్వాత దాన్ని ఎలా కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు?
అనంత బాబు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని అబద్ధం చెప్పారు. మృతదేహాన్ని ఇంటి ముందు పడేసి, అంత్యక్రియలు చేసేస్తే డబ్బు ఇస్తానని బెదిరించారు.























