బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతిచెందారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో భారీ ప్రాణనష్టం సంభవించింది. మొదట 10 మంది చనిపోయారని రాగా, ఆపై మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోవడంతో సమీప గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి..
కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెండంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఈ దురదృష్టకర ఘటన గురించి తెలియగానే కాకినాడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నాను. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ… క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించే ఏర్పాట్లు చేశారు. బాణాసంచా తయారీ పరిశ్రమ నుంచి ఇంకా పేలుళ్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. పేలుళ్లకు కారణాలపై విచారణ చేస్తున్నారు.
బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భద్రత చర్యలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిసర గ్రామాలకు పొగ అలుముకున్న క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకి ధైర్యం చెప్పి, మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లను ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షణ చేపట్టి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలని సూచించారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ పేలుడు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గం పెరవలి నుండి హుటాహుటిన కాకినాడ వేట్లపాలెం బయల్దేరారు. అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు మంత్రి కందుల దుర్గేష్.
























