Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Kakinada Fire Cracker Explosion | కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో వేట్లపాలెం - మేడపాడు గ్రామాల మధ్య ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడులో ప్రాణ నష్టం సంభవించింది. మృతదేహాలు ముక్కలుగా పడిపోయాయి.

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం, మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ధాటికి తయారీ కేంద్రం మంటల్లో కాలి బూడిదైంది. ఈ పేలుడు ఘటనలో 18 మంది కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని తెలుస్తోంది. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చుట్టుపక్కల 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలుముకుందని, అసలేం జరిగిందా అని భయాందోళనకు గురైనట్లు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది మహిళా కార్మికులు మందుగుండు సామాగ్రిని తయారు చేస్తున్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బాణసంచా తయారు చేస్తున్న కార్మికుల శరీరాలు ముక్కలు ముక్కలుగా కొంతదూరం వరకు పడ్డాయి. ఘటనా స్థలం యుద్ధ వాతావరణాన్ని తలిపించేలా హృదయవిదారకరంగా మారింది. స్థానికులు, అధికారులు స్పందించి, క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా ఎప్పటిలాగే కార్మికులు బాణసంచా తయారీ చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా తయారీ కేంద్రంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. శబ్ధం విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకునే సరికి.. అక్కడ మొత్తం బూడిదగా మారింది. బాణసంచా తయారు చేస్తున్న కార్మికుల మృతదేహాలు గుర్తుపట్టలేనట్లుగా మారాయి. కొందరి కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు ముక్కలై కొంత దూరంలో ఎగిరిపడ్డాయంటే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో అర్థమవుతోంది. చుట్టుపక్కల 4, 5 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్ధం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
రంగంలోకి కలెక్టర్, ఎస్పీ.. సహాయక చర్యలు ముమ్మరం
సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాద తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 
రెవెన్యూ & పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీసేందుకు శ్రమిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

జీజీహెచ్కు క్షతగాత్రుల తరలింపు
ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్ల ద్వారా చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (GGH)కి తరలించారు. అక్కడ వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

























