Pawan Kalyan Razole Visit: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపరిచిత వ్యక్తి వైసీపీ నేత..! వీవీఐపీ పాస్ ఎలా సంపాదించాడంటే..
ఈనెల 26న రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఓఅపరిచిత వ్యక్తి ఆయనకు అత్యంత సమీపానికి వచ్చాడని జనసేనపార్టీ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.

రాజోలు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 26న అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పర్యటనలో ఓ అపరిచిత వ్యక్తి ఆయనకు అత్యంత సమీపంలో సంచరించాడని జనసేన పార్టీ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదుచేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది..
కొబ్బరి తోటలు పరిశీలించిన పవన్ కళ్యాణ్
శంకర గుప్తం మేజర్ డ్రైన్ వల్ల కేసనపల్లి, కేశవదాసుపాలెం తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించేందుకు రాజోలు నియోజకవర్గానికి ఈ నెల 26న ఆప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈసమయంలో తీసినన వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతుండగా ఆ వీడియోలో జనసేన పార్టీకు కానీ, కూటమిలో ఏపార్టీకు సంబంధం లేని వ్యక్తి ముఖం కనిపించింది.. ఆ వ్యక్తి మలికిపురం మండలంలోని గూడపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడిగా చెలామణి అయిన వ్యక్తిగా గుర్తించిన పార్టీ నాయకులు, జనసైనికులు ఒకింత కలవరానికి గురయ్యారు. అసలు ఆ వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడు. మెడలో వీవీఐపీ పాస్తో పవన్ కళ్యాణ్కు అత్యంత సమీపానికి ఎలా వచ్చాడు..? ఇలా అనేక సందేహాలు చుట్టుముట్టాయి.. దీనిపై పార్టీ ముఖ్యనేతలకు సమాచారం అందించారు.
పార్టీ కేంద్ర కార్యాలయం అప్రమత్తమయ్యింది.. వెంటనే అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు.. దీనిపై యుద్ధప్రాత పదికన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు రాజోలు పోలీసులు ఆ రోజు శంకర గుప్తం డ్రైన్ పరిశీలన స్థలం వద్ద పవన్ పర్యటన వీడియోలను పరిశీలించి అనుమానస్పదంగా సంచరించిన వ్యక్తని కనుగొన్నారు.. అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు.
గూడపల్లికి చెందిన వైసీపీ నాయకుడిగా గుర్తింపు...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోజు దెబ్బతిన్న కొబ్బరి తోటల పరిశీలనకు వచ్చిన సందర్భంలో తీసిన వీడియోలను పరిశీలించిన పోలీసులు స్థానికులు చెప్పిన పలు ఆధారాల ప్రకారంగా పవన్ కళ్యాణ్కు అత్యంత సమీపంలో సంచరించిన వ్యక్తిని గుర్తించారు. వీడియోల ఆధారంగా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన పున్నం నరసింహారావు అలియాస్ నరసింహ అలియాస్ చికిలి అనే వ్యక్తిగా గుర్తించారు. అతను పక్కా వైసీపీకు చెందిన వ్యక్తి అని, వైసీపీ అధికారంలో ఉండగా గూడపల్లి గ్రామంలో వైసీపీ నాయకునిగా చెలామణి అవ్వడమే కాకుండా గ్రామంలో వైసీపీ ఫ్లెక్సీలు కట్టడం, వైసీపీకు అనుకూలంగా, కూటమికు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వంటివి చేసేవాడని గుర్తించారు. దీంతో రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సదరు పున్నం నరసింహారావును అదుపులోకి తీసుకుని విచారించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకునిగా తిరిగిన సదరు వ్యక్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం జనసేన నాయకులతో కలిసి తిరుగుతున్నాడని నిర్ధారిం చారు.
వీవీఐపీ పాస్ ఎలా సంపాదించాడంటే..
పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొనేందుకు రాజోలు నియోజకవర్గంలోని జనసేన నాయకులకు చాలా మందికి పాస్ లు జారీ చేశారు. ఇందులోభాగంగానే మలికిపురం మండల వైస్ ఎంపీపీ, జనసేన నాయకుడు సుందర శ్రీనివాస్ కు పవన్ పర్యటనకు సంబంధించి పల్లెపండుగ సభకు వీవీఐపీ పాస్ జారీచేశారు. అయితే హెలీప్యాడ్ వద్దకు వెళ్లేందుకు శ్రీనివాస్ కు అవకాశం రాకపోవడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయి తనకు ఇచ్చిన పాస్ ను ఇంటి వద్దనే పెట్టేశాడు.
ఇటీవల కాలంలో సుందర శ్రీనివాస్తో తిరుగుతున్న సదరు నరసింహారావు ఆ పాస్ను తన వెంట తెచ్చుకుని మెడలో వేసుకుని పవన్ కళ్యాణ్ కు అత్యంత సమీపంలో సంచరించినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అంటే అభిమానంతోనే అత్యంత దగ్గరగా చూసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ఇతను ప్రస్తుతం జనసేనలో సభ్యత్వం కలిగిఉండగా విచారించిన పోలీసులు విచారణలో తేలింది.





















