Pawan Kalyan : వైసీపీని ఓడించడానికి సవాలక్ష కారణాలు - ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క సీటూ రాకూడదన్న పవన్ !
ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీని ఓడించడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయన్నారు.

Pawan Kalyan : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని.. అది అసాధ్యమేమీ కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ జెండా ఎగరకూడదన్నది.. ఎవరెస్ట్ ఎక్కడం కంటే ఎంతో సులభమన్నారు. కాకినాడ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, కాకినాడ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ తోట సుధీర్ శుక్రవారం భీమవరం నిర్మలా ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
వైసీపీ గెలవకుండా ఉండటానికి ఎన్నో కారణాలున్నాయన్న పవన్
వైసీపీ గెలవకూడదు అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వైసీపీ పాలనలో యువతకు ఉపాధి లేదు.. రైతులకు లాభం సంగతి పక్కన పెడితే కనీసం గిట్టుబాటు ధర దక్కడం లేదు. గిట్టుబాటు కల్పించకపోగా ప్రతి బస్తాకీ రూ.వంద చొప్పున దోచుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. సగటు యువతకు ఉపాధి, రైతుకి గిట్టుబాటు ధర లాంటివి సాధించాలంటే చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తుల సమూహం అవసరం. తోట సుధీర్ లాంటి వ్యక్తుల రాకతో పార్టీ బలంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నేరస్తులను ఎదుర్కోవాలంటే చట్టంపై అవగాహన ఉన్న వారు కావాలన్న జనసేనాని
నేరస్తులను ఎదుర్కోవాలంటే చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తుల మద్దతు అవసరం అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాలన్నా చట్టాల మీద సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులు కావాలన్నారు. రాజకీయాల్లోకి పోరాట పటిమ, విలువలు ఉన్న వారు రావాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. ప్రముఖ న్యాయవాది తోట సుధీర్ లాంటివారు జనసేన పార్టీలో చేరికతో అది నెరవేరిందన్నారు.
నేరస్తుల్ని ఎదుర్కోవడానికి చట్టాలపై అవగాహన ఉన్నవారు కావాలి
— JanaSena Party (@JanaSenaParty) June 30, 2023
• పోరాట పటిమ, విలువలున్న వారు రాజకీయాలకు అవసరం
• వైసీపీని ఓడించడం అసాధ్యమేమీ కాదు
• జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•జనసేనలోకి కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ తోట సుధీర్#VarahiVijayaYatra… pic.twitter.com/1JOxklfU9n
అడ్డదారులు తొక్కకుండా నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నా : పవన్
సుధీర్ తో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్నా ఎప్పుడూ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించలేదు. వారి కుటుంబం మొత్తం మద్దతు ఇచ్చి పంపారు. ఆయనతోపాటు పార్టీలో చేరేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ 5 వేల మందిని కదిలించే శక్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో జనసేన జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో అమ్ముడుపోవడం తేలిక. నా మటుకు నాకు పుట్టిన నేల బాగుండాలి.. దేశం బాగుండాలి అన్న కోరిక తప్ప మరే కోరికా లేదు. అడ్డదారులు తొక్కకుండా నిజాయతీగా రాజకీయాలు చేయడం చాలా కష్టం. ఆ విధంగా నిలబడ్డాం కాబట్టే ఈ రోజు ప్రతి ఒక్కరూ మన వైపు వస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















