Telangana Politics: బీఆర్ఎస్ను మించి గ్రౌండ్ పాలిటిక్స్లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్ను ఆకర్షిస్తారా?
Kavitha : జాగృతి పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్న కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో రాజకీయ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ కంటే వేగంగా ఆమె క్షేత్రస్థాయి సమస్యలపై స్పందిస్తూ, ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.

Kavitha aggression in ground politics goes beyond BRS: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అనూహ్య మార్పు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నేతలు ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కొంత తడబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాము ఇంకా సమర్థవంతమైన ప్రతిపక్షంగా మారలేకపోతున్నాం అని గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అయితే, సరిగ్గా ఇక్కడే కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో రాజకీయ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ కంటే వేగంగా ఆమె క్షేత్రస్థాయి సమస్యలపై స్పందిస్తూ, ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.
వెలుగుమట్ల బాధితుల కోసం అనూహ్య ఉద్యమం
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్ల కూల్చివేతపై కవిత చేసిన పోరాటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం ్వుతోంది. నిరాశ్రయులైన కుటుంబాల కోసం ఆమె ఏకంగా ఖమ్మం నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, పోలీసుల నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీఆర్ఎస్ కేడర్ అంతా స్తబ్దుగా ఉన్న తరుణంలో, ఆమె నేరుగా గ్రౌండ్ లెవల్లోకి వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వడం ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో ఆమెపై సానుభూతి , మద్దతు పెరుగడానికి కారణం అయింది.
లిక్కర్ కేసు నుంచి విముక్తి
ఇటీవలే ఢిల్లీ లిక్కర్ కేసు నుండి విముక్తి పొందిన కవిత తెలంగాణ జాగృతి వేదికగా తన రాజకీయ పునరాగమనాన్ని అత్యంత శక్తివంతంగా చాటుకుంటున్నారు. తనను పార్టీ నుండి పంపేశారని చెబుతున్న ఆమె చేస్తున్న పోరాటాలు చూస్తుంటే.. బీఆర్ఎస్ చేయలేని పనిని ఆమె ఒంటిచేత్తో చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ వంటి అగ్రనేతలు ఇంకా వ్యూహాల్లో నిమగ్నమై ఉండగా, కవిత మాత్రం నేరుగా యాక్షన్ లోకి దిగడం బీఆర్ఎస్కు షాక్ లాంటిదే. కవిత ఇప్పుడు తన 'తెలంగాణ ఉద్యమ కాలం' నాటి పంథాను మళ్లీ ఎంచుకున్నారు. అప్పట్లో జాగృతి ద్వారా ఎలాగైతే ప్రజలను సమీకరించారో, ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో వెళ్తున్నారు. చట్టసభల్లో గొంతుక కంటే.. వీధుల్లో చేసే పోరాటమే బలంగా వినిపిస్తుంది అనే సిద్ధాంతాన్ని ఆమె పాటిస్తున్నారు.
బీఆర్ఎస్ లీడర్, క్యాడర్ జాగృతి వైపు ఆకర్షితులవుతారా?
జగదీష్ రెడ్డి చెప్పినట్లుగా పార్టీ ఇంకా ప్రతిపక్ష పాత్రకు అలవాటు పడకపోవచ్చు కానీ, కవిత మాత్రం ఇప్పటికే ఆ పాత్రలో ఒదిగిపోయారు. ప్రజా సమస్యలపై ఆమె చూపిస్తున్న ఈ తెగువ, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆమెకు ప్రజల మద్దతును మరింత పెంచుతున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ కేడర్ కూడా ఆమె నాయకత్వం వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కేటీఆర్ కూడా వెంటనే.. ప్రెస్మీట్లు, సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కాకుడా.. ప్రత్యక్షంగా రాజకీయ యుద్ధాలకు దిగాలన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్ లో వినిపిస్తోంది.























