Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Kurnool Crime News | మంత్రాలయం సమీపంలో తుంగభద్ర నదికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఈతకు దిగారు. నీటి లోతు అంచనా వేయలేకపోవడంతో ఐదేళ్ల బాలుడితో సహా ఐదుగురు గల్లంతయ్యారు.

Tragedy in Kurnool | మంత్రాలయం: కర్నూలు జిల్లాలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం సమీపంలో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన వారిని హైదరాబాద్కు చెందిన ఐదేళ్ల బాలుడు యువన్ చంద్ర, సతీశ్(35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను(23), ఉరవకొండకు చెందిన సంధ్య(22)గా పోలీసులు గుర్తించారు. నదిలో స్నానానికి దిగి ఒకేసారి ఐదుగురు మునిగిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులంతా మంత్రాలయంలోని తమ బంధువుల ఇంట్లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ పూర్తయిన అనంతరం, కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా గడపడానికి సమీపంలోని తుంగభద్ర నదికి వెళ్లారు. అక్కడ నదిలోకి దిగిన వీరు, నీటి లోతు ఎంత ఉందో సరిగ్గా అంచనా వేయలేకపోయారు. లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహ వేగం కారణంగా ఒక్కసారిగా అందరూ నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు.
ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆదోనికి చెందిన అపర్ణ అనే మహిళా బంధువు ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపర్ణ ఇచ్చిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం గల్లంతైన మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు























