Social Media: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ - సాధ్యమవుతుందా?
AP government: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే అమలు సాధ్యంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

AP government is considering banning social media for children: మారుతున్న కాలంతో పాటు సాంకేతికత అందిస్తున్న ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా పొంచి ఉన్నాయన్న ఆందోళనల కారణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయానికి సిద్ధమవుతోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఐటీ ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడంతో, ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు నమూనాగా నిలిచే ఈ నిర్ణయం చిన్నారుల భవిష్యత్తును కాపాడే దిశగా ఒక కీలక అడుగుగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన సోషల్ మీడియా నిషేధ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా కేస్ స్టడీగా తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కేవలం స్మార్ట్ఫోన్ చేతిలో ఉంది కదా అని ప్రతి కంటెంట్ను చూసే అవకాశం ఇవ్వడం వల్ల పిల్లలు మానసిక పరిణతి చెందకముందే తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్నెట్ ప్రపంచంలో వడపోత లేకుండా వచ్చే సమాచారాన్ని విశ్లేషించే శక్తి చిన్న వయసులో ఉండదని, ఇది వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు సైబర్ బుల్లీయింగ్, అశ్లీలత , సోషల్ మీడియా వ్యసనం. గంటల తరబడి రీల్స్ చూస్తూ కాలక్షేపం చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడమే కాకుండా, వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్లే జీవితం అనుకునే భ్రమలో చిన్నారులు తమ బాల్యాన్ని కోల్పోతున్నారన్న నిపుణుల హెచ్చరిస్తున్నారు. అందుకే ఒక సేఫ్ ఆన్లైన్ ఎకోసిస్టమ్ ను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, ఈ నిషేధం అమలు చేయడం అనేది సాంకేతికంగా ఒక పెద్ద సవాలు. పిల్లల వయస్సును నిర్ధారించే ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీని పకడ్బందీగా ఎలా అమలు చేయాలి? గ్లోబల్ సోషల్ మీడియా దిగ్గజాలు ఈ నిబంధనలకు సహకరిస్తాయా? అనే కోణంలో ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. కేవలం నిషేధించడమే కాకుండా, పిల్లలను విద్యాపరమైన, సృజనాత్మకమైన కంటెంట్ వైపు మళ్లించేలా ప్రత్యామ్నాయ వేదికలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
చివరికి, ఈ లక్ష్యం నెరవేరాలంటే చట్టంతో పాటు సామాజిక మార్పు కూడా అవసరం. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినప్పటికీ, తల్లిదండ్రులలో అవగాహన రానంత వరకు ఇది పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. ఇంట్లోనే పిల్లల డిజిటల్ అలవాట్లపై పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు చిన్నారుల మానసిక ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకు న్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, దేశంలోనే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తుంది.























