CM Chandrababu: అంగన్వాడీ బాలుడు లక్షిత్ మృతిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Anganwadi boy death after missing | అంగన్వాడీ కేంద్రం నుంచి తప్పిపోయిన ఓ రెండున్నరేళ్ల బాలుడు శవమై కనిపించడంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు.

Ap cm Chandrababu | అమరావతి: ఏపీలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమయంలో అదృశ్యమైన ఓ చిన్నారి కథ విషాదాంతమైంది. ప్రకాశం జిల్లాలో రెండున్నర ఏళ్ల బాలుడు లక్షిత్ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. కంభం మండలం లింగోజిపల్లిలో లక్షిత్ మృతిపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు.
రెండు రోజులక్రితం లక్షిత్ అనే బాలుడు అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లాడు. అయితే బాలుడు లక్షిత్ దారితప్పి అడవిలోకి వెళ్లిపోయాడని ఎస్పీ తెలిపారు. అడవిలో దాదాపు రెండురోజులపాటు ఆహారం, నీరు లభించక లక్షిత్ మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఎస్పీని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
కొనకనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి శ్రీను, సురేఖ దంపతులకు సంతానం ఇద్దరు కాగా, ఓ కుమారుడు లక్షిత్, నెలల పాప ఉన్నారు. శ్రీను హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న సమయంలో భార్య సురేఖ గర్భం దాల్చింది. ఆమెను రెండు నెలల కిందట డెలివరీ కోసం పుట్టినిల్లు లింగోజిపల్లికి వచ్చారు. ఇటీవల వీరికి ఓ పాప పుట్టింది. రెండున్నరేళ్ల కుమారుడు లక్షిత్ను తల్లిదండ్రులు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి పంపుతున్నారు. జులై 8న ఉదయం 11 గంటల సమయంలో లక్షిత్ అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయాడు. తాను ఆపేందుకు చూడగా, తన చేతి కొరికి వెళ్లిపోయాడని నాలుగో తరగతి విద్యార్థి చెప్పడంతో లక్షిత్ విషయం తెలిసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ల సాయంతో గాలించినా ఆచూకీ దొరకలేదు.
మృతదేహాన్ని చూసి సమచారం ఇచ్చిన మహిళ
గురువారం నాడు బాలుడి మృతదేహం గుర్తించారు. అయితే డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో లేకపోవడంతో కొన్ని గంటల కిందే హత్య చేసి ఉంటారని గుర్తించారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు ఆదేశించారు. కంభం సీఐ మల్లికార్జునరావు, ఎస్.ఐ.నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం గాలింపులు చేపట్టాయి. గ్రామానికి కొద్ది దూరంలో బాలుడి చెప్పులను పోలీస్ డాగ్ గుర్తించింది. అయినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం సూరేపల్లి శివారులోని పొలాల్లో బాలుడి మృతదేహాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అది అదృశ్యమైన లక్షిత్ మృతదేహమని గుర్తించారు. అసలేం జరిగింది, ఎవరు తీసుకెళ్లారు, ఎలా చనిపోయాడని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.






















