Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) భాగంగా కొలంబోలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ( India vs Pakistan ) ఓడించింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ పరాజయంలా కాకుండా, పాక్ క్రికెట్ బోర్డులోని అంతర్గత రాజకీయాలను బట్టబయలు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్, కేవలం 114 పరుగులకే కుప్పకూలడం ఆ దేశ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
తమ టీమ్ పతనంపై పాక్ దిగ్గజ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf ) సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. "రాజకీయ జోక్యం, వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టకపోతే పాకిస్థాన్ క్రికెట్ మళ్ళీ పుంజుకోదు. ఇది మన క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి కాలం" అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆన్ క్వాలిఫైడ్ పర్సన్స్ కు పదవులు ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆయన ఘాటుగా విమర్శించారు.
మ్యాచ్కు ముందు జరిగిన 'బోయకాట్ డ్రామా', ఐసీసీతో చర్చలు, మరియు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ జోక్యం వంటి రాజకీయ పరిణామాలు ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మైదానంలో ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొలంబోలో భారత్ చేతిలో ఈ అవమానకర ఓటమి తప్పలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.























