నిండు గర్భిణీని డోలీలో 10 కిలోమీటర్లు మోసుకు వచ్చిన కుటుంబ సభ్యులు
నిండు గర్భిణీని డోలీలో 10 కి.మీ. మేర తీసుకువచ్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం శృంగవరపుకోట మండలం మూల బొడ్డవర పంచాయతీ శివారు చిట్టెం పాడు గ్రామానికి చెందిన మజ్జిగ గంగమ్మ(30) అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కొండ కిందకు దాదాపు పది కి.మీ. మేర డోలీలో తీసుకు వచ్చారు కుటుంబ సభ్యులు. 10 కి.మీ మోసుకుని వచ్చి శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రహదారి మార్గం లేకపోవడంతో డోలీలో ఇబ్బందులు పడుతున్నామంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకలు మారుతున్నా తమ కష్టాలు తీరడం లేదని వాపోతున్నారు.



















