Mahabubabad Railway Station: రూ.26.49 కోట్లతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్ రీడెవలప్మెంట్, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు
Amrit Bharat Scheme | కేంద్ర ప్రభుత్వం రూ.26.49 కోట్లతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్ రీడెవలప్మెంట్ చేస్తోంది. త్వరలోనే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు కిషన్ రెడ్డి.

Mahabubabad Railway Station | మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంతో దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధి చూస్తే ఇది రైల్వేస్టేషనా, లేక విమానాశ్రయమా అనే తరహాలో అప్గ్రేడ్ చేస్తున్నారు. అందుకోసం కొన్ని రోజులపాటు రైల్వేస్టేషన్లకు కొన్ని రైళ్లను దారిమళ్లించడం లాంటివి చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, బేగంపేట, కరీంనగర్, మహబూబాబ్ రైల్వే స్టేషన్లను అమృత్భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
త్వరలోనే మహబూబాబాద్ రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. రూ.26.49 కోట్ల వ్యయంతో చేపట్టిన మహబూబాబాద్ రైల్వేస్టేషన్ పనులు దాదాపు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభించనున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, వెయిటింగ్హాల్ పనులు, కవర్ ఓవర్ ప్లాట్ఫాం పనులు పూర్తయ్యాయని తెలిపారు.

ఓవరాల్ గా చూస్తే 92 శాతం మేర పని పూర్తయిందని, అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమవుతోందన్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ ఫొటోల్ని కిషన్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల అప్గ్రేడేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

అసలేంటీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్
దేశంలోని రైల్వేస్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీర్ఘకాలిక ప్రణాళికనే ఈ 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' అని చెప్పవదచ్చు. ఈ పథకం కింద దేశంలోని కొన్ని రైల్వేస్టేషన్లను ఎంపిక చేసి దశలవారీగా ఒక్కో స్టేషన్కు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి, పునరాభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో కంటే రైల్వేస్టేషన్లను మరింత అందంగా, పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా మార్చడమే దీని లక్ష్యం.
మహబూబాబాద్ రైల్వే స్టేషన్
— G Kishan Reddy (@kishanreddybjp) September 2, 2025
తెలంగాణలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద పునరాభివృద్ధి పనులు ముగించుకుని అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి రానుంది.
ముఖ్యాంశాలు:
💰 ప్రాజెక్టు వ్యయం: ₹26.49 కోట్లు
📊 పని స్థితి: 92% పూర్తి pic.twitter.com/u1rnw74Iz4
ఈ పథకం ద్వారా రైల్వేస్టేషన్లలో ఏం పనులు చేస్తారు..
రైల్వే స్టేషన్లోకి ప్రవేశం (Entry), నిష్క్రమణ మార్గాల (Exit) మెరుగుదల, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, పరిశుభ్రమైన ప్లాట్ఫారమ్లు, మరుగుదొడ్లు, రైల్వేస్టేషన్ పైకప్పులు వంటివి పునరుద్ధరిస్తారు.రైల్వే స్టేషన్లకు దగ్గర్లో ఉన్న నగరాలను కలుపుతూ స్టేషన్ బిల్డింగ్ అప్గ్రేడ్ చేస్తారు. ఈ రైల్వేస్టేషన్లను బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు. అవసరమైన చోట లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉచిత వై-ఫై సదుపాయం, మెరుగైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన రైల్వే స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకం కింద స్థానిక ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించారు. ఫుడ్ కోర్టులు, ఆట స్థలాలు వంటివి ఏర్పాటు చేస్తారు. స్టేషన్ సమీపంలో రోడ్లను వెడల్పు చేయడం, అవసరం లేని నిర్మాణాలు ఉంటే తొలగించడం, ప్రత్యేక పాదచారుల మార్గాలు (Walkers Root), మెరుగైన పార్కింగ్, బెస్ట్ లైటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అంధుల కోసం..
బ్రెయిలీ సంకేతాలు, స్పర్శతో గుర్తించదగిన మార్గాలు, లిఫ్ట్లు, ర్యాంప్లు వంటి సదుపాయాలతో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.






















