Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ - రూ.358 కోట్ల దీపావళి బోనస్ రిలీజ్, ఒక్కో కార్మికునికి ఎంతంటే?
Telangana News: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నానికల్లా కార్మికుల ఖాతాల్లో నగదు జమ కానుంది.

Telangana Government Released Singareni Bonus To Workers: సింగరేణి కార్మికులకు (Singareni Workers) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి బోనస్ కింద గురువారం రూ.358 కోట్లు విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సచివాలయంలో కీలక ప్రకటన చేశారు. దీపావళి బోనస్గా పిలవబడే పీఎల్ఆర్ఎస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్) బోనస్ను సింగరేణి కార్మికులకు చెల్లిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా పండుగ బోనస్ కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. బోనస్ కింద ఒక్కో కార్మికుడు రూ.93,750లు అందుకోనున్నారు. దీంతో సంస్థలో పని చేస్తోన్న దాదాపు 40,000 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. కాగా, జే.బీ.సీ.సీ.ఐ. విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంటోంది. ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
కార్మికులకు రూ.1250 కోట్ల చెల్లింపులు
కాగా, ఇటీవలే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796 కోట్లను కంపెనీ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఒక్కొక్క కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందాయి. అలాగే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5 వేల చొప్పున చెల్లించారు. అలాగే పండుగ అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికునికి రూ.25 వేల చొప్పున మరో రూ.90 కోట్లను కంపెనీ చెల్లించింది. ఇప్పుడు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున రూ.93,450లు లభిస్తాయి. మొత్తమ్మీద ఈ నెల రోజుల వ్యవధిలో దీపావళి బోనస్, లాభాల వాటా, పండుగ అడ్వాన్స్ కింద రూ.1,250 కోట్లను సంస్థ చెల్లించింది. ఈ విధంగా సగటున సింగరేణి ఉద్యోగులు ఈ నెల రోజుల కాలంలో ఒక్కొక్కరు సుమారు రూ.3 లక్షల వరకు అందుకున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో సింగరేణి సంస్థ సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ బోనస్ చెల్లింపుపై తగు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బోనస్ డబ్బులను దుబారా చేయవద్దని, ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని లేదా కుటుంబ అవసరాలకు అనుగుణంగా జాగ్రత్తగా వెచ్చించాలని ఆయన కార్మికులకు సూచించారు.
Also Read: Telangana News: తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్కు ప్రత్యేక సైన్యం - కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















