Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ విషయంలో తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Telangana News | హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలాగ నేను ఏది పడితే అది మాట్లాడలేను, రాయలేను. నాకు బాధ్యత, విధానం ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు సంపాదించుకోవడానికో లేదా వ్యాపారాలు విస్తరించుకోవడానికో కాదని, కేవలం ప్రజా సేవ కోసమేనని తేల్చి చెప్పారు. ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో ఒక పత్రికలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు.
సింగరేణి సంస్థ విషయంలో మంత్రికి ఏం సంబంధం..?
టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ. సంస్థనే దానికి కండీషన్ పెడుతుంది. సంబంధిత శాఖ మంత్రికి ఆ వ్యవహారంతో సంబంధం ఉంటుంది. సైట్ విజిట్ పెట్టి తమకు కావాల్సిన వారికి టెండర్ ఇచ్చుకున్నారని కట్టు కథలు రాశారని మండిపడ్డారు. సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లను కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పిలిచిందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో మంత్రి ప్రమేయం ఉండదని, సంస్థే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
గనులు క్లిష్ట ప్రాంతాల్లో ఉన్నందున ఫీల్డ్ విజిట్ నిబంధన విధించారని, ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కూడా అమల్లో ఉన్నాయని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డికి తాను సన్నిహితుడిని కావడం వల్లనే, కొందరు ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపిస్తూ పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తున్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తిత్వ హననం చేసేలా, నాయకుల మధ్య విభేదాలు సృష్టించేలా కథనాలు రాయడం తగదని భట్టి విక్రమార్క హెచ్చరించారు. దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ వనరులను కాపాడి, వాటిని పేదలకు సమానంగా పంచడమే తన ధ్యేయమన్నారు. మీడియా సంస్థల మధ్య ఉండే అంతర్గత విభేదాల్లోకి ప్రజాప్రతినిధులను లాగవద్దని, ఇలాంటి అసత్య ప్రచారాలకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు.
అసలేం జరిగిందంటే..!
సింగరేణి కి చెందిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ కాంట్రాక్ట్ ను NTV చైర్మన్ నరేంద్ర చౌదరి అల్లుడి కంపెనీకి దక్కేలా చేయడం కోసం... డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిబంధనల్లో మార్పులు చేయించారు అని ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం వచ్చింది. ఆ పత్రిక MD రాధాకృష్ణ వీక్లీ కాలమ్ లో ఈ విషయాన్ని రాసారు. ఐతే ఈ బొగ్గు గని నీ దక్కించుకునేందుకు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కి చెందిన సోదరుడి సంస్థ అడ్డంకి గా ఉందని... దాన్ని తొలగించుకోవడం కోసం కోమటి రెడ్డి ఇమేజ్ ను దెబ్బతీసేలా ఎన్టీవీలో కథనాలు వేసారని రాధాకృష్ణ తన కాలమ్ లో రాసారు. మంత్రి కోమటిరెడ్డి కి మహిళా IAS లకు అనైతిక సంబంధం ఉందనేలా NTV లో కథనం వచ్చింది. దీనిపై IAS అసిసియేషన్ సీరియస్ అవ్వడం.. ఆపై వారు కంప్లైంట్ ఇవ్వడంతో.. పోలీసు శాఖ చురుగ్గా SIT ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎన్టీవీ జర్నలిస్ట్ లు ముగ్గురు ను అరెస్ట్ చేసింది. NTV Chairman , CEO లను విచారణకు పిలిచారు. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ తప్పుడు ఉద్దేశ్యంతోనే కోమటి రెడ్డి పై ఎన్టీవీలో కథనం వచ్చిందని.. NTV కి అనుకూలంగా ఆ మైనింగ్ బ్లాక్ దక్కేలా... 'Field visit ' నిబంధన ను సింగరేణి తీసుకురావడం వెనుక డిప్యూటీ సీఎం భట్టి ఉన్నారని ఆంధ్ర జ్యోతిలో రాసారు. దానిపైనే భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు























