![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana Formation Day: గ్రాండ్గా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జూన్ 2న వేడుకల పూర్తి షెడ్యూల్ ఇదే
Telangana News: జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు.
![Telangana Formation Day: గ్రాండ్గా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జూన్ 2న వేడుకల పూర్తి షెడ్యూల్ ఇదే Telangana Chief Minister Revanth Reddy announced Telangana formation day celebrations Telangana Formation Day: గ్రాండ్గా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జూన్ 2న వేడుకల పూర్తి షెడ్యూల్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/c9ce4401f83f92a371e816cce63c3c1e1717080196654234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పేరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ఉండనుంది.
జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం అవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.
అనంతరం ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు.
రాత్రి 8.50 గంటలకు 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్వర్క్స్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.
చుక్కారామయ్యను కలిసిన రేవంత్ రెడ్డి
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. గత కొంతకాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. నల్లకుంటలోని చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను పరామర్శించారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని సీఎం చుక్కా రామయ్యను కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)