Heatwave Warning: బయట తిరిగితే పోతారు.. జాగ్రత్త! ఎల్ నినో ప్రభావంతో ప్రాణాంతకంగా మారిన ఎండలు
El Nino Impact | ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఏప్రిల్, మే నెలలో మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

వేసవి మొదట్లోనే మండుటెండలు చుక్కులు చూపిస్తున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఇంతలా అధిక ఉష్ణోగ్రతలకు కారణమైన ఎల్ నినో అంటే ఏంటి, తెలంగాణలో రాబోయే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉండబోతుందనే విషయాలపై వాతావరణశాఖ అధికారి GNRS శ్రీనివాసరావుతో ఏబిపి దేశం ప్రత్యేక ఇంటర్వూ..
ఏబిపి దేశం..
తెలంగాణలో ఈ ఏడాది సాధారణ రోజుల కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి..?
GNRS శ్రీనివాసరావు, వాతావరణశాఖ అధికారి..
మార్చి , ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు ఈసారి మార్చి మొదటి, రెండవ వారాల్లోనే విపరీతంగా పెరగడం జరిగింది. మార్చి మొదటి వారంలోనే 40డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు తెలంగాణ వ్యాప్తంగా నమోదైయ్యాయి. వేసవిలో ఇలా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఉపరితల వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి. గాలి దిశలలో మార్పులు వస్తుంటాయి.దీనివల్ల ఈదురు గాలులు, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు వడగండ్ల వానలు పడుతుంటాయి. వీటినే ఫ్రీ మాన్సుూన్ షవర్స్ అంటారు. మార్పి 16 నుండి ఏప్రిల్ నెలాఖరువరకూ ఇలా ఈదురు గాలులు, ఉరుముల ప్రభావం అనేక ప్రాంతాల్లో ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3డిగ్రీలు ఎక్కువ.
ఏబిపి దేశం..
తెలంగాణ వ్యాప్తంగా ఏఏ జిల్లాలలో ఆరెంజ్ , ఎల్లో అలెర్ట్ లు ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమొదవుతున్నాయి. కారణాలేంటి.?
GNRS శ్రీనివాసరావు,వాతావరణశాఖ అధికారి..
రాష్ట్రంలో ఎక్కవ ఉష్ణోగ్రతలు నార్త్ తెలంగాణ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ , కొమరం భీమ్ జిల్లాలో నమోదవుతున్నాయి. ఈస్ట్ తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాతో పాటు రాయలసీమను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉంటాయి. సెంట్రల్ తెలంగాణలో వీటికంటే 2 లేదా 3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకూ అత్యధిక ఉష్ణగ్రతలు ఈ ఏడాది ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో నమోదైయ్యింది. హైదరాబాద్ నగరంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉష్ణోగ్రతలలో మార్పులు అంచనా వేసి రాగల ఐదు రోజుల్లో ఏఏ జిల్లాల్లో ఏ స్దాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయో గుర్తించి ఆరెంజ్ , ఎల్లో , రెడ్ అలెర్ట్ లు జారీ చేస్తాము. ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల మధ్య ఉంటే ఎల్లో అలెర్ట్, 41 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటే ఆరెంజ్ అలెర్ట్, 45డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటితే ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయడం జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో ఎక్కవ జిల్లాలు ఆరెంజ్ అలెర్ట్ లో ఉన్నాయి.
నార్త్ తెలంగాణ సెంట్రల్ ఇండియాకు దగ్గరగా ఉండే ప్రాంతం, మధ్యప్రదేశ్ కు ఆనుకుని ఉన్న ప్రాంతం కావడంతో సముద్ర ప్రాంతానికి దూరంగా వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు ల్యాండ్ మాస్ వైపు ఎక్కువగా ఉంటాయి. మధ్యప్రదేశ్ దాటి రాజస్దాన్ లోకి వెళితే మరింత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.భౌగోళికంగా ఈ పరిస్దితులు ఉంటాయి.
ఏబిపి దేశం..
మే నెలలో హైదరాబాద్ లో ఎండల తీవ్రత ఎలా ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలో ఏ స్దాయిలో ఉష్ణోగ్రతలు నమోదైయ్యే అవకాశాలున్నాయి.?
GNRS శ్రీనివాసరావు,వాతావరణశాఖ అధికారి..
ఏప్రిల్ నెలలో 39 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకూ సాధారణస్దాయి ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది దాటి 3 లేదా 4 ఢిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం వివిధ జిల్లాలపై కూడా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో మే నెలలో 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైయ్యే అవకాశాలున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది ఇప్పుడు ఒకేసారి వచ్చిన మార్పు కాదు . గత 20 ఏళ్లుగా నెమ్మదిగా నగరంలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. సుమద్రమట్టం నుండి హైదరాబాద్ 500 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు గ్రహించి, తిరిగి రాత్రిపూట వేడి గాలులను విడుదల చేస్తాయి. అందుకే హైదరాబాద్ లో రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడంలేదు. పెద్ద పెద్ద నిర్మాణల ప్రభావంతో గాలి కదలికలు తక్కువ ఉండటం వల్ల రీ రేడియేషన్ ప్రభావం , ఉక్కపోతలకు కారణమవుతోంది. నగరంలో వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో కాలుష్యం కూడా అంతే స్దాయిలో పెరిగిపోయింది.
ఏబిపి దేశం..
EL నినో అంటే ఏంటి.. తెలంగాణలో ఎండల తీవ్రతకు EL నినో ప్రభావమే కారణమా..?
GNRS శ్రీనివాసరావు,వాతావరణశాఖ అధికారి..
EL నీనో అనేది ఓ గ్లోబల్ ఫినామినా.. సమ్మర్ లో మనకు విపరీతంగా వేడి ఉండటంతోపాటు ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్తాన్, ఆఫ్గనిస్దాన్ లలో విపరీతమైన వేడిమి వల్ల లోప్రషర్ ఏరియా ఇక్కడ ఉంటుంది. అదే సమయంలో భూమద్య రేఖ దిగువన దక్షిణార్దగోళంలో శీతాకాలం కావడంతో అక్కడ విపరీతమైన చలి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నచోట హైప్రషర్ ఉంటుంది. అక్కడ హైప్రషర్ నుండి ఇక్కడ ఇక్కడ లోప్రషర్ ను న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని వేల కిలోమీటర్లు గాలులు ఇటు వస్తాయి. ఈ క్రమంలో మనకు మాన్ సూన్ తీసుకురావడం వల్ల నాలుగు నెలలపాటు మనకు వర్షాలు పడతాయి. ఈ గాలులు ఓ వాటర్ సర్క్లేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ క్రమంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఉష్ణోగ్రతలు 0.5 పెరిగినా అది మాన్ సూన్ మీద ప్రభావం చూపుతుంది. దీన్నే ఎల్ నినో కండీషన్ అంటారు., దీనివల్ల మాన్ సూన్ ఫ్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కంటే పెరిగితే సూపర్ ఎల్ నినో అని అంటారు. జూలై నెలలో మనకు ఎల్ నినో వల్ల మాన్ సూన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి. ఈసారి వర్షపాతం గత ఏడాదితో పోల్చితే 92శాతం మాత్రమే ఉంటే అవకాశం ఉంది. గత ఏడాది 110శాతం వర్షపాతం నమోదైయ్యింది.
ఏబిపి దేశం..
ఎండల తీవ్రత , ఉష్ణోగ్రతల ప్రభావం రోజులో ఏ సమయంలో ఎక్కువగా ఉంటోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా..?
GNRS శ్రీనివాసరావు, వాతావరణశాఖ అధికారి..
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి ఉన్నప్పుడు, ముఖ్యంగా మధ్యాహ్నం 12గంటల నుండి సాయంత్రం 4గంటల వరకూ ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయట ఉంటే సన్ స్ట్రోక్ తగిలే అవకాశాలు ఎక్కవ.దీని వల్ల మరణం సంభవించే అవకాశం ఉంది. ఆ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట తిరగాల్సి వచ్చినప్పుడు తల భాగం కప్పిఉంచేలా, టోపీ పెట్టుకోవడం లేదా కండువా చుట్టుకోవడం చేయాలి. లైట్ కలర్ దుస్తులు వేసుకోవడం, గంటకోసారి నీళ్లు త్రాగడం, గంటకోసారి నీడకు వచ్చి 15నిమిషాలు శరీరం కూల్ అయ్యేలా చూసుకోవడం, సాల్ట్ వేసుకుని బటర్ మిల్క్ వంటి ద్రావణాలు త్రాగడం .. ఇలా జాగ్రత్తలు పాటించడం వల్ల సన్ స్ట్రోక్ నుండి రక్షించుకునే అవకాశం ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు





















