(Source: Poll of Polls)
Revanth Chit Chat: బీఆర్ఎస్ ఒక శవం.. ఎన్ని అలంకరణలు చేసినా వృథా - చిట్చాట్లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy : బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని అలంకరణలు చేసినా ఆ పార్టీ బతకదని సీఎం రేవంత్ అన్నారు. మీడియా ప్రతినిధులతో చేసిన ఇష్టాగోష్టిలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Revanth On BRS: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ ముగిసిపోయిందని, ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా అది తిరిగి లేచి వస్తుందా? బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉందని తేల్చారు. కవిత పెట్టిన పార్టీపైనా స్పందించారు. కొత్త పార్టీల గురించి ఆలోచించేకంటే, ఉన్న పార్టీయే ఉంటుందో ఊడుతుందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎంతో ఆకాంక్షతో అధికారం ఇస్తే, కేసీఆర్ కుటుంబం అహంకారంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, అందుకే ప్రజలు వారికి ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చి పంపించారని మండిపడ్డారు.
కుటుంబ ప్రయోజనాల కోసమే తాపత్రయం
బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం ఒక కుటుంబం కోసమే పనిచేస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబంతో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయని, ఇప్పుడు ఆ ఇంట్లో జరుగుతున్న పంపకాల పంచాయతీ వల్లే అనుబంధ సంస్థలు, కొత్త రాజకీయ సమీకరణలు పుట్టుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. వారసత్వ సంపద కోసం, అధికారం కోసం ఆ కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే తన కొడుకు కేటీఆర్ను సీఎం చేయాలని ప్రయత్నించారని, ఇదంతా కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.
కేసీఆర్ శత్రువు కాదు.. కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే
చనిపోవాలని కోరుకుంటున్నట్లుగా కేసీఆర్ చేసిన విమర్శలను కూడా రేవంత్ రెడ్డి ఖండించారు. కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు. ఆయన ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నది నేనే. ఆయన్ని స్వయంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను అని గుర్తుచేశారు. ఆయనకు చెడు జరగాలని కోరుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఇప్పటికే తాను విజయం సాధించి అధికారంలో ఉన్నానని చెప్పారు. అయితే, కేసీఆర్కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటారేమో అని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ముగిసిన బీఆర్ఎస్ అధ్యాయం
తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సాగిన బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సీఎం పేర్కొన్నారు. పదేళ్ల అహంకార పూరిత పాలనకు జనం చరమగీతం పాడారని, ఇప్పుడు ఆ పార్టీని బతికించేందుకు ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదని విశ్లేషించారు. రాజకీయంగా తమ పని అయిపోయిందని తెలిసే, ఇప్పుడు మనుగడ కోసం రకరకాల వేషాలు వేస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తం మీద బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైందని ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు






















