Crime News: నిత్య పెళ్లి కొడుకుగా కానిస్టేబుల్, పోక్సో కేసు నమోదు! విచారణకు ఆదేశించిన ఎస్పీ
Suryapet News | నిత్య పెళ్లి కొడుకుగా కానిస్టేబుల్ మైనర్ బాలికను సైతం వివాహం చేసుకున్నాడని ప్రచారం జరగడంతో సూర్యాపేట జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకుగా మారాడు. అవకాశం దొరికితే చాలు పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ఓ మైనర్ బాలికను సైతం కానిస్టేబుల్ వివాహం చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. నడిగూడెం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కృష్ణంరాజు ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం.
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కానిస్టేబుల్..
ఇదే క్రమంలో మూడవ వివాహం ఏడాది కిందట సూర్యాపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికతో జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బాలిక ప్రస్తుతం సూర్యాపేట పట్టణంలో నివసిస్తున్నట్టు సమాచారం. బాలికతో పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ దృష్టికి రావడంతో ఆయన విచారణకు ఆదేశించారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. ఆయన బాలిక నివాసానికి వెళ్లి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.
డిప్యూటేషన్పై కలెక్టరేట్లో విధులు
ఇక కృష్ణంరాజుపై ఇదే మొదటిసారి ఆరోపణలు కాదు. గతంలో తిరుమలగిరి పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. అనంతరం ఆయనను నడిగూడెం స్టేషన్కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన సూర్యాపేట కలెక్టరేట్లో డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజాగా మైనర్ బాలికతో వివాహం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేందుకు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మైనర్ బాలికతో వివాహం వ్యవహారం వైరల్ కావడంతో కానిస్టేబుల్ కృష్ణంరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.





















