Formula E Race Case: కేటీఆర్కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
ACB KTR Summons: ఫార్ములా-ఈ రేసు నిధుల దుర్వినియోగం కేసులో కేటీఆర్ సహా నిందితులకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై31న హాజరు కావాలని ఆదేశించింది.

KTR Summoned by Acb Court In Formula E Race: హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేసు నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు గట్టి షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన దాదాపు 250 పేజీల ఛార్జిషీట్ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి సహా మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. వీరంతా జూలై 31న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
రూ. 55 కోట్ల అక్రమ మళ్లింపు
2024లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు కోసం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ. 55 కోట్ల నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండానే ఈ భారీ మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేయడంపై ఏసీబీ తన ఛార్జిషీట్లో కీలక ఆధారాలను పొందుపరిచింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఈ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే ఈ కేసులో గవర్నర్, కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతులు మంజూరు చేయడంతో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
కోర్టు సమన్ల వెనుక అర్థమేంటి?
సాధారణంగా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేసిందంటే.. నిందితులపై ఉన్న ఆరోపణల్లో ప్రాథమికంగా వాస్తవం ఉందని న్యాయస్థానం సంతృప్తి చెందిందని అర్థం. జూలై 31న కేటీఆర్ కోర్టుకు హాజరైనప్పుడు ఆయనకు ఛార్జిషీట్ కాపీలను అందజేస్తారు. ఆ దశలో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడమో లేదా ఆరోపణలను క్వాష్ చేయాలని కోరడమో చేయాల్సి ఉంటుంది. ఒకసారి విచారణ ప్రారంభమైతే మాత్రం ఇది రాజకీయంగా కేటీఆర్కు పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
రంగంలోకి ఈడీ
ఈ కేసులో ఏసీబీ దర్యాప్తుతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దూకుడు పెంచింది. విదేశీ నిధుల బదిలీ, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఇప్పటికే ఆరా తీస్తోంది. రాజకీయంగా చూస్తే, ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధంగా మారింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను గ్లోబల్ లెవల్కు తీసుకెళ్లడానికే రేసు నిర్వహించాం అని కేటీఆర్ సమర్థించుకుంటుండగా.. బ్రాండ్ ఇమేజ్ పేరుతో ప్రజా ధనాన్ని విదేశీ సంస్థలకు దోచిపెట్టారు అని రేవంత్ రెడ్డి సర్కార్ ఘాటుగా విమర్శిస్తోంది. ఏసీబీ కోర్టు తాజా నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. జూలై 31న కోర్టులో జరిగే పరిణామాలు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని బీఆర్ఎస్ నేతలు టెన్షన్కు గురవుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















