Leopard in Peddapalli: పెద్దంపేట శివారులో చిరుతపులి సంచారం, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల సూచన!
Leopard in Peddapalli: పెద్దపలిల్లి జిల్లా పెద్దంపేట గ్రామ శివారులో చిరుత కలకలం రేపుతోంది. పుశువుల మధ్యలోంచి చిరుత వెళ్లడం గమనించిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Leopard in Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధి అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని ఎస్టీ కాలనీ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఈరోజు ఉదయం పశువుల కాపర్లు తమ పశువుల మధ్యలో నుంచి చిరుత వెళ్లినట్లు గుర్తించారు. అప్రమత్తమైన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

రామగుండం ఫారెస్ట్ అధికారి రహమతుల్లా తన సిబ్బందితో ఎస్టీ కాలనీలో పరిశీలించారు. చిరుత పులి అడుగులను గుర్తించి, నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిరుతపులి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా బహిరంగ ప్రదేశాలలో తిరగవద్దని సూచించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో పశువులను మేపకుండా ఉండాలని పేర్కొన్నారు.

ఇటీవలే రాజన్న సరిసిల్ల జిల్లాలో..
చిరుత సంచారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతోంది. పదిరోజుల వ్యవధిలోనే మరో చిరుత వరుస దాడులు చేసింది. తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో చిరుత సంచారం రైతులతో పాటు గ్రామస్తులలో కూడా భయాందోళనకు గురి చేసింది. పది రోజుల క్రితం వేణుగోపాల్పూర్లో గేదె, రెండు దూడలను చంపిన చిరుత నిన్న రాత్రి గండిలచ్చపేట గ్రామంలోకి ప్రవేశించి పొలిమేరల్లో ఉన్న గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపింది.
రైతు తన గేదెను పొలం దగ్గర కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం వెళ్ళి చూడగా అది మృత్యువాత పడి ఉంది. అక్కడి పరిసరాల్లోని కాలి అడుగుల గుర్తులను బట్టి చిరుత పులి దాడి చేసినట్లుగా స్థానికులు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గ్రామ రైతులు తమ పశువులను మొదటి నుండి పొలాలు వద్దే కట్టేసుకుంటారని, గతంలో ఎన్నడూలేని విధంగా చిరుత దాడి చేసిందని వాపోయారు. గ్రామ శివారులో చిరుత సంచరించి, వరుస దాడులు చేస్తూ గేదెలను మరియు దూడలను చంపడంతో రైతులు మరియు గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నామన్నారు.
గుంపులు గుంపులుగా వెళ్లండి.. అటవీ శాఖ అధికారులు...
ఫారెస్ట్ అధికారులు సైతం సమీప గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు.. తునికాకు ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవి లోపలికి ప్రజలు వెళ్లకూడదని.. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గుంపులుగా మాత్రమే కలిసి వెళ్లాలని సూచించారు. అయితే ఇప్పటి వరకూ మనుషులపై దాడి చేయని చిరుతపులి ప్రధానంగా ఆకలి తీర్చుకోవడానికి మూగజీవాల పైన అర్ధరాత్రి వేళల్లో తరచూ దాడులు చేస్తోంది. సంఖ్యాపరంగా చూస్తే ఇది ఒకటేనా లేదా ఈమధ్య ఏమైనా వాటి సంఖ్య పెరిగిందా ? అనే విషయంపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు
నిజానికి గుట్టలను ప్రధాన ఆవాసంగా చేసుకుని తిరుగుతున్న చిరుతపులి ఒకసారి సమీప గ్రామాల పై దాడి చేయడం మొదలుపెట్టింది అంటే ఇక తేలికగా దొరికే ఆహారం కోసం అది అలవాటు పడుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పెద్దగా ప్రతిఘటించలేని ఆవులు గేదెలు, మేకలు లాంటి జంతువులను టార్గెట్ చేసుకుంటుంది. మరోవైపు ఇప్పటికైనా అధికారులు స్పందించి మనుషులపై దాడి చేసే పరిస్థితి రాకముందే వెంటనే చిరుతపులిని పట్టుకోవాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా వేసవి కాలం ముగిసే రోజుల్లో ఉపాధి కోసం అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్ళే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని విన్నవించుకుంటున్నారు.
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు






















