Railway Board Rejects Free MMTS: ఉచిత ఎంఎంటీఎస్కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
Telangana Govt Free MMTS Proposal: తెలంగాణ ప్రభుత్వానికి రైల్వే బోర్డు షాక్ ఇచ్చింది. ఎంటిఎస్ లో ఫ్రీ ప్రయాణం కుదరదని స్పష్టం చేసింది రైల్వే శాఖ. రూ. 490 కోట్ల బకాయిలు, నష్టాల కారణంతో తిరస్కరించింది.

Hyderabad Free MMTS for Women: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం తరహాలోనే, హైదరాబాద్ నగర రవాణాకు కీలకమైన ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదనకు రైల్వే బోర్డు గట్టి బ్రేక్ వేసింది. సాంకేతిక, ఆర్థిక కారణాలను చూపుతూ రైల్వే బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.
హైదరాబాద్లోని సబర్బన్ రైల్వే నెట్వర్క్ అయిన MMTS రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సుల్లో రద్దీని తగ్గించడంతో పాటు మధ్యతరగతి, ఉద్యోగినులకు మరింత లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులతో చర్చలు కూడా జరిపారు. అయితే జాతీయ రైల్వే విధానాల ప్రకారం ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డు ఆమోదించలేదు.
రైల్వే బోర్డు తిరస్కరణకు ప్రధాన కారణాలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించడానికి రైల్వే బోర్డు ముఖ్యంగా ఆర్థిక కారణాలను ప్రస్తావించింది. ప్రస్తుతం MMTS రైళ్ల నిర్వహణ వల్ల రైల్వే శాఖకు ఏటా దాదాపు 160 కోట్ల మేర వార్షిక నష్టాలు వస్తున్నాయని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే రాయితీలతో నడుస్తున్న ఈ సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని, అది రైల్వే వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని బోర్డు పేర్కొంది.
బకాయిలు పెండింగ్
కేవలం వార్షిక నష్టాలు మాత్రమే కాకుండా, MMTS ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రైల్వే శాఖకు రావలసిన దాదాపు రూ. 490 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని రైల్వే బోర్డు గుర్తుచేసింది. ప్రాజెక్ట్ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సకాలంలో చెల్లించకపోవడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణించింది. పాత బకాయిలే క్లియర్ కానప్పుడు, కొత్తగా ఉచిత ప్రయాణాల భారాన్ని మోయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
పూర్తి ఖర్చు భరిస్తేనే పరిశీలిస్తాం
ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత పథకాన్ని MMTS లో ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటే, దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా రైల్వే బోర్డు సూచించింది. ఈ పథకం వల్ల వచ్చే వంద శాతం ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించడానికి సిద్ధపడి, ఆ నిధులను ముందుగానే రైల్వే శాఖకు డిపాజిట్ చేస్తేనే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అంటే మహిళల టికెట్ చార్జీల మొత్తాన్ని సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే రైల్వేకు చెల్లించాల్సి ఉంటుంది.
నీరుగారిన ప్రభుత్వ ఉద్దేశం
రైల్వే బోర్డు తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో నగర మహిళలకు మరో భారీ కానుక ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆర్టీసీకి వందల కోట్లు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు MMTS ఖర్చును కూడా భరించడానికి సిద్ధపడుతుందా? లేదా రైల్వే బోర్డుతో చర్చలు జరిపి బకాయిలు చెల్లించేందుకు మొగ్గు చూపుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు






















