HYDRA: రూ.18,000 కోట్ల విలువైన భూమి రికవరీ, బతుకమ్మకుంట ముమ్మాటికీ చెరువే: రంగనాథ్
Bathukamma Kunta | రూ. 18,000 కోట్ల విలువైన 2,093 ఎకరాల భూములను రికవరీ చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంట ఆక్రమణలపై ఆధారాలతో కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.

HYDRA Commissioner Ranganath | హైదరాబాద్: హైడ్రా చేపట్టిన చర్యల ద్వారా ఇప్పటివరకూ 2 వేలకు పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేయగా.. వాటి విలువ రూ.18000 కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అంబర్పేటలోని బతుకమ్మ కుంట అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని హైడ్రా (HYDRA) కమిషనర్ తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి ఎడ్ల సుధాకర్ అనే వ్యక్తికి 1986 నాటి అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే అది చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. గతంలో సుధాకర్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా అతడు పొజిషన్లో లేడని పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారమే తాము అక్కడ ఉన్న బోర్డులు, ఇతర నిర్మాణాలను తొలగించామని రంగనాథ్ వివరించారు.
బతుకమ్మ కుంటపై నాసా ఆధారాలున్నాయి
సుధాకర్ అక్కడ అసలు చెరువే లేదని వాదిస్తున్నారని, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొట్టిపారేశారు. 1975లో ఇరిగేషన్ రికార్డుల్లో కుంటగా పేర్కొన్న ఆధారాలను చూపించారు. సర్వే నంబరు 563/1 లో 9.19 ఎకరాల వరకూ చెరువున్నట్టు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ రికార్డులు ఉన్నాయని తెలిపారు. ఆ చెరువుకు కట్ట 563/2 సర్వే నంబరులో 6 గుంటల మేర మాసాన్ కట్ట పేరిట ఉందన్నారు. 1990 నాటి నాసా (NASA) శాటిలైట్ ఫోటోలతో పాటు, 1970 నాటి భారత నీటి సర్వేల రికార్డులను పరిశీలిస్తే అక్కడ పూర్వం నుంచే బతుకమ్మ కుంట ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ ఫొటోలు, వీడియోలను సరిపోల్చుతూ రూపొందించిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. పహానీలలో కూడా ఈ చెరువు బతుకమ్మ కుంట, ఎర్రకుంట పేర్లతో నమోదై ఉందని తెలిపారు. సుధాకర్ భూమిని తాము చెరువుగా మార్చామనే ఆరోపణలు వాస్తవం కాదని, తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.

బతుకమ్మ కుంటపై తుది తీర్పు వచ్చే వరకూ దీనిమీద ఎవరూ ఓనర్షిప్ క్లెయిమ్ చేయకూడదనే కోర్టు నిబంధనల మేరకు బోర్డులు, గేట్లు తొలగించామని తెలిపారు. బతుకమ్మ కుంట చెరువు చుట్టూ వేసిన ఫెన్సింగ్ను తొలగిస్తే ప్రమాదాలు జరుగుతాయని సుప్రింకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలిపినట్లు చెప్పారు. వివరణతో 3 వారాల్లో అఫడవిట్ను దాఖలు చేయాలనిమని సోమవారం సుప్రీంకోర్టు సూచించిందని రంగనాథ్ తెలిపారు.
హైడ్రా కూల్చివేతలు, చర్యలపై కమిషనర్ రంగనాథ్
ఇతర ప్రాంతాల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపులపై కూడా రంగనాథ్ వివరాలు అందించారు. నార్సింగిలోని ముష్కిన్ చెరువు ఆక్రమణల కూల్చివేతలపై ముందుగానే సమాచారం ఇచ్చామని తెలిపారు. అలాగే సున్నం చెరువు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఐలాపూర్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై డ్రైవ్ చేపట్టామని, అక్కడ బాధితులంతా పేదలే ఉన్నందున 1500 ఇళ్లను కూల్చివేయలేదని స్పష్టం చేశారు. ఫాతిమా కాలేజీ వివాదంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎఫ్టీఎల్ (FTL) డిమార్కేషన్ చేయాల్సి ఉందని తెలిపారు.
2093 ఎకరాలు రికవరీ చేసిన హైడ్రా
హైడ్రా ఇప్పటివరకు చేపట్టిన చర్యల ద్వారా 2,093 ఎకరాల భూమిని రికవరీ చేసిందని రంగనాథ్ వెల్లడించారు. మార్కెట్ ధరల ప్రకారం ఈ భూముల విలువ సుమారు రూ.18,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఆక్రమణలు, ఇతర నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటివరకు హైడ్రా పరిధిలో 90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా హైడ్రా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























