HYDRA Demolitions: రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
HYDRAA Commissioner Ranganath | సంగారెడ్డి అమీన్పూర్ మండలం ఐలాపూర్లో దాదాపు 15వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాత్ తెలిపారు.

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ ప్రభుత్వానికి ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు లాయర్ ముఖీమ్ ఆరోపించారు. కుంటలు, చెరువులు, జలాశయాలు ఉంటే వాటి వద్ద FTL, బఫర్ జోన్లు నిర్ణయించి ప్రభుత్వ ఆస్తులను హైడ్రా పరిరక్షించాలి కానీ మిగతా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా ఫిర్యాదులు ఇస్తే పోయి కూలగొట్టడమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. హౌసింగ్ సొసైటీ, హౌసింగ్ లే ఔట్స్ కనిపిస్తే వాటి మీద పడుతున్నారని, వాటితో డబ్బులు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇటీవల ఇంటర్వ్యూలో సైతం రంగనాథ్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు.
‘నోటీసులు ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. మీ ఇల్లు శికం భూముల్లో కట్టారని ఓ ఇంటర్వ్యూలో అడిగితే అది 40 ఏళ్ల కింద మా నాన్న కట్టారని రంగనాథ్ చెబుతున్నాడు. ఒవైసీ సోదరులు ఫాతిమా కాలేజీని చెరువు మధ్యలో కట్టినా చర్యలు తీసుకోవడం లేదు. మీరు అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు, జైల్లో పెడతారని ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉండకపోతే మీ భూములు లాక్కుని వ్యాపారం చేయాలని ప్లాన్ చేశారు. హైడ్రా ప్రభుత్వ అధికారిగా కాదు, ఓ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అమీన్ పూర్, ఐలాపురం, కిష్టారెడ్డిపేటలలో బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తరువాత ఆ బిల్డింగ్స్ జోలికి పోవాలని కోర్టు సైతం హైడ్రాను ఆదేశించింది. కోర్టుల్లో కేసు ఉంది విచారణ జరుగుతుందని చెబితే, ఫిర్యాదు వచ్చిందనే సాకుతో కట్టడాలు అక్రమంగా కూల్చివేస్తున్నారని’ సుప్రీంకోర్టు లాయర్ ముఖీమ్ ఆరోపించారు.
ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టుకున్నందుకే కూల్చివేతలు: రంగనాథ్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురంలో శనివారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఐలాపురంలోని భూములపై 1998 నుంచే హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయని, అయితే వాటిని బేఖాతరు చేస్తూ లాయర్ ముఖీమ్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫాంహౌస్ను నిర్మించుకున్నారని రంగనాథ్ తెలిపారు. కేవలం ఒక ఫాంహౌస్తో మొదలైన ఈ ఆక్రమణ, కాలక్రమేణా 40 ఎకరాలకు విస్తరించిందని రంగనాథ్ వివరించారు.
గత 20 ఏళ్లుగా ముఖీమ్ తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి, ఒక్కో 100 గజాల స్థలాన్ని సుమారు 10 లక్షల రూపాయలకు పేద ప్రజలకు విక్రయించి కోట్ల రూపాయలు గడించినట్లు ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా, సామాజిక మాధ్యమాల్లో హైడ్రా చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఐలాపురం కూల్చివేతలపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని రంగనాథ్ స్పష్టం చేశారు.
కాగా, శనివారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ముఖీమ్ నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని, ఆక్రమణదారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు






















