హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్. ఆమెను ఈడీ అధికారులు గురుగ్రామ్లో అరెస్టు చేశారు.
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
Nowhera Shaik Arrested:హీరా గోల్డ్ స్కామ్లో నౌహీరా షేక్ను ఈడీ అధికారులు గురుగ్రామ్లో అరెస్టు చేశారు. 5600 కోట్ల మోసం, సుప్రీంకోర్టు ఆదేశాలు, నకిలీ ఐడీలు, ఆస్తుల వేలం- తాజా పరిణామాల పూర్తి వివరాలు.

- హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ అరెస్ట్.
- నకిలీ ఐడీలతో పరారైన ఆమెను టెక్నికల్ ఇంటెలిజెన్స్ సాయంతో పట్టుకున్నారు.
- సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించి, బెయిల్ రద్దుతో అరెస్టు అనివార్యమైంది.
- 5600 కోట్ల మోసం కేసులో ఆస్తుల వేలం ద్వారా కొంత నగదు వసూలు.
Nowhera Shaik Arrested: హీరా గోల్డ్ కుంభకోణంలో కీలక మలుపు. ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ను ఈడీ అధికారులు గురుగ్రామ్లో అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి నకిలీ ఐడీలతో పరారీలో ఉన్న ఆమెను టెక్నికల్ ఇంటెలిజెన్స్ సాయంతో పట్టుకున్నారు. 5600 కోట్ల మోసం కేసులో తాజా అప్డేట్స్ ఇక్కడ చదవండి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కోట్ల కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గత కొంతగాలంగా అధికారులు కళ్లు గప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ అధినేత్ర నౌహీరా షేక్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చిక్కింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఒక అద్దె ఇంట్లో మారువేషంలో తలదాచుకున్న ఆమెను టెక్నికల్ ఇంటెలిజెన్స్ సాయంతో అధికారులు మే 21న అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ ఐడీలతో పరారీ
నౌహీరా షేక్ తనపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ ఆధార్ కార్డును, ఇతర పోర్జరీ పత్రాలను ఉపయోగించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఏప్రిల్ 8, న సుప్రీంకోర్టు ఆమెకు లొంగిపోవాలని వారం రోజుల గడువు ఇచ్చింది. అయితే ఆమె లొంగిపోకుండా పరారీలోకి వెళ్లడంతో ఈడీ నిఘా పెట్టి ఆమెను పట్టుకుంది. ఆమెను ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్కు తరలించి, బేగంపేటలోని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆమెపై నకిలీ పత్రాల వినియోగానికి సంబంధించిన గురుగ్రామ్ పోలీసులు విడిగా కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది.
నౌహీరా షేక్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు అనేకసార్లు ఆమెకు అవకాశాలు ఇచ్చింది. తొలుత జనవరి 2021లో ఇన్వెస్టర్ల సొమ్మును సెటిల్ చేస్తానన్న హామీపై ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ రూ. 580 కోట్ల డిపాజిట్ చేయాలన్న కోర్టు ఆదేశాలను ఆమె పాటించలేకపోయింది.
2025 మార్చి 5న జరిగిన విచారణలో జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఆమెకు చివరి అవకాశం ఇస్తూ, మూడు నెలల్లోగా పాతిక కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని చెల్లించని పక్షంలో బెయిల్ ఆటోమేటిక్గా రద్దు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఆమె ఆ మొత్తాన్ని చెల్లించకపోవడమే కాకుండా, ఈడీ వేలం వేస్తున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కూడా సహకరించడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఆమె బెయిల్ రద్దు కావడంతో ఈ అరెస్టు అనివార్యమైంది.
ఏంటీ హీరా గోల్డ్ స్కామ్
హీరా గోల్డ్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నౌహీరా షేక్ ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ను సృష్టించింది. దీని వెనుక ఉన్న ప్రధాన ఆకర్షణ హలాల్ ఇన్వెస్ట్మెంట్. వడ్డీ తీసుకోవడం ఇస్లాం ధర్మానికి విరుద్ధమని నమ్మే ముస్లిం వర్గాన్ని ఆమె లక్ష్యంగా చేసుకుంది. తమది వడ్డీ వ్యాపారం కాదని, బంగారం వ్యాపారంలో భాగస్వామ్య అని నమ్మబలికింది.
ఏడాదికి ఏకంగా 36 శాతం లాభం ఇస్తామని నమ్మించి వేల కోట్లు వసూలు చేసింది. సుమారు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు ఈ పథకంలో చిక్కుకున్నారు. ఈడీ అంచనాల ప్రకారం దీని విలువ 3000 కోట్ల నుంచి 5900 కోట్ల వరకు ఉండొచ్చు.
మొదట్లో ఇన్వెస్టర్లకు క్రమం తప్పకుండా లాభాలు పంపిణీ చేసి నమ్మకం కలిగించిన నౌహీరా, తర్వాత కొత్త ఇన్వెస్టర్ల నుంచి వచ్చే డబ్బుతో పాత వారికి చెల్లింపులు చేసే పోంజీ స్కీమ్ నడిపినట్టు అధికారులు గుర్తించారు. 2018లో చెల్లింపులు ఆగిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఎవరీ నౌహీరా షేక్
తిరుపతికి చెందిన ఒక సాధారణ కూరగాయల వ్యాపారి కుమార్తె అయిన నౌహీరా షేక్, తొలుత ఖురాన్ టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. తన పేరు ముందు ఆలిమా, డాక్టర్, వంటి బిరుదులను తగిలించుకొని మతపరమైన విశ్వాన్ని పెట్టుబడిగా మార్చుకుంది. 2007లో హీరా గోల్డ్ సంస్థను స్థాపించి, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా తన కార్యకలాపాలను విస్తరించింది. తాను ఘనా నుంచి బంగారం దిగుమతి చేసుకుంటానని ప్రచారం చేసుకునేది. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొనడానికి ఆమె ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్తో నకిలీ అవార్డులను కూడా సృష్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయాల్లోకి వచ్చిన నౌహీరా
వ్యాపారం వేల కోట్లకు చేరానే నౌహీరా రాజకీయాల్లోకి వచ్చింది. 2017లో అల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ ఏర్పాటు చేసింది. వజ్రం గుర్తుతో ఎన్నికల బరిలో దిగింది. 2018 కర్ణాటక ఎన్నికల్లో 224 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఈ ఎన్నికల ప్రచారం కోసం ఇన్వెస్టర్ల సొమ్మును పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్టు బాలీవుడ్ నటులను ప్రచారానికి రప్పించినట్టు ఆధారాలు లభించాయి. ఈ రాజకీయ ఖర్చుల వల్లనే ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆగిపోయాయని కొందరి వాదన.
ఆస్తుల వేలం
బాధితులకు సొమ్ము తిరిగి చెల్లించేందుకు ఈడీ నౌహీరాకు చెందిన పలు ఆస్తలను అటాచ్ చేసింది. నవంబర్ 21, 2025న హైదరాబాద్లోని ఒక స్థిరాస్తిని ఈడీ 19. 64కోట్లకు వేలం వేసింది. ఇప్పటి వరకు వేలం ద్వారా, ఇతర మార్గాల్లో సుమారు 93. 63 కోట్లు వసూలు అయ్యాయి. సుమారు 428 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. నౌహీరా, ఆమె బంధువులకు చెందిన రెండు కోట్ల విలువైన 12 విలాసవంతమైన వాహనాలను కూడా ఈడీ సీజ్ చేసింది. వీటిని కూడా వేలం వేయాలని కోర్టును కోరింది.
నౌహీరా షేక్ తన వద్ద ఉన్న ఆస్తుల జాబితాను పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని, కొన్ని వివాదాస్పద ఆస్తులను మాత్రమే చూపిస్తోందని ఈడీ కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా టౌలీచౌకీలలోని 753 కోట్ల విలువై ఆస్తిపై అనేక వివాదాలు, ఆక్రమణలు ఉన్నట్టు తేలింది.
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
21 మే 2026న తెలంగాణ హైకోర్టులో నౌహీరా తరఫున న్యాయవాదులు తమపై ఉన్న నాన్బెయిలబుల్ వారెంట్లపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. అయితే జస్టిస్ ఈవి వేణుగోపాల్ ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈడీ, రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ప్రస్తుతానికి నౌహీరాను అధికారుల ముందు లొంగిపోవాలని సూచించారు. ఈ పరిస్థితుల్లోనే గురుగ్రామ్లో ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
బాధితులకు న్యాయం ఎప్పుడు
దాదాపు 8 ఏళ్లుగా సాగుతున్న కేసులో బాధితులు తమ సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. నౌహీరా షేక్ అరెస్టు అవ్వడం ఇది మొదటిసారి కాదు, కానీ ప్రతిసారీ ఆమె కోర్టు నుంచి ఉపశమనం పొందుతూ వచ్చింది. అయితే ఈసారి సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆమె వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఒక వేళ ఆమె 25 కోట్లు చెల్లించకపోతే బెయిల్ శాశ్వతంగా రద్దయ్యి, తదుపరి విచారణ జైలు నుంచే కొనసాగుతుంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు ఎవరు?
నౌహీరా షేక్ను ఎక్కడ, ఎప్పుడు అరెస్టు చేశారు?
నౌహీరా షేక్ను మే 21న హర్యానాలోని గురుగ్రామ్లో ఒక అద్దె ఇంట్లో మారువేషంలో ఉన్నప్పుడు అరెస్టు చేశారు.
నౌహీరా షేక్పై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి?
నౌహీరా షేక్పై 5600 కోట్ల మోసం, ఇన్వెస్టర్లను నమ్మించి వడ్డీకి బదులుగా భాగస్వామ్యమని చెప్పి డబ్బులు వసూలు చేయడం, పోంజీ స్కీమ్ నడపడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
హీరా గోల్డ్ స్కామ్లో ఎంతమంది బాధితులు ఉన్నారు?
హీరా గోల్డ్ స్కామ్లో సుమారు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు బాధితులుగా ఉన్నారు. ఈడీ అంచనాల ప్రకారం దీని విలువ 3000 కోట్ల నుంచి 5900 కోట్ల వరకు ఉండొచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















