Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. డీఏ మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కోటి బీమా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

DA For Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు , పెన్షనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా మూడు విడతల డీఏలు పెండింగ్లో ఉండగా, ప్రస్తుతానికి ఒక విడత డీఏను 2.73 శాతం తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
నెలకు ప్రభుత్వంపై రూ. 277 కోట్ల ఆర్థిక భారం
ఈ డీఏ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాపై గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఒక విడత డీఏ వల్ల నెలకు రూ. 227 కోట్ల చొప్పున, ఏడాదికి సుమారు రూ. 2,724 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మిగిలిన రెండు విడతల డీఏల విడుదలకు సంబంధించి కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా
కేవలం డీఏ మంజూరు మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రకటించారు. విధి నిర్వహణలో లేదా ప్రమాదవశాత్తూ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, సంబంధిత ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఈ బీమా రక్షణగా నిలుస్తుంది. దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంత భారీ మొత్తంలో బీమా కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఉద్యోగు హెల్త్ స్కీమ్ బలోపేతం చేయడం , మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
జీపీఎఫ్ ఖాతాల్లోకి బకాయిలు
ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ 2.73 శాతం డీఏ పెంపు, జనవరి 2026 నెలకు సంబంధించిన జీతంతో కలిపి నగదు రూపంలో అందుతుంది. అంటే ఫిబ్రవరిలో ఉద్యోగులు అందుకునే జీతంలో ఈ పెంపు కనిపిస్తుంది. ఈ డీఏ వాస్తవానికి జూలై 1, 2022 నుండి అమలు కావాల్సి ఉంది. కానీ కానీ జూలై 2023 నుంచి అమలు చేస్తారు. 30 నెలల బకాయిలు చెల్లిస్తారు. బకాయిలు గత సంప్రదాయం ప్రకారం, సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వారి జి.పి.ఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు సి.పి.ఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులయితే, అందులో 10 శాతం ప్రాన్ ఖాతాకు, మిగిలిన 90 శాతం నగదు రూపంలో నిర్ణీత వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. పెన్షనర్లు ఈ బకాయిలను నేరుగా నగదు రూపంలోనే వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు.
ట్రెండింగ్ వార్తలు






















