KTR ChitChat: అనుకున్నన్ని సీట్లు రాలేదని కాంగ్రెస్లోనే అసంతృప్తి - అరెస్టుకు సిద్ధం - కేటీఆర్ చిట్ చాట్
Municipal elections: మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాలేదని కాంగ్రెస్లో అసంతృప్తి ఉందని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసులో మళ్లీ నోటీసులు ఇస్తారన్న సమాచారం ఉందన్నారు.

KTR Chit Chat on municipal elections Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని నింపాయని.. వారు ఆశించిన స్థాయిలో స్థానాలు సాధించలేకపోయారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీకి సాధారణంగా ఉండే సానుకూలతను వాడుకుని.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా కాంగ్రెస్కు పూర్తి విజయం దక్కలేదని ఎద్దేవా చేశారు. మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలు గట్టిగా పోరాడటం వల్లే 17 మున్సిపాలిటీల్లో విజయం సాధించామని.. హంగ్ ఏర్పడిన చోట్ల కూడా తమకే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైందని గుర్తు చేస్తూ.. ఇప్పుడు తమ ప్రదర్శన చాలా మెరుగ్గా ఉందని విశ్లేషించారు.
బీజేపీ హడావిడి ఎక్కువ.. ఫలితాలు తక్కువ
బీజేపీ ప్రదర్శనపై కూడా కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ప్రచారం చేసినా.. హడావిడి చేసినా ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవలేకపోయారని విమర్శించారు. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్లు , వార్డులు తగ్గాయని.. కేవలం గొప్పలు చెప్పుకోవడానికే ఆ పార్టీ పరిమితమైందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అధినేతల పర్యటనల కంటే స్థానిక అంశాలే కీలకంగా ఉంటాయని.. ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి తమ పార్టీ అద్భుతంగా నిలబడిందని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమ పార్టీని తక్కువ అంచనా వేసిన వారికి ఈ ఫలితాలే సరైన సమాధానమని స్పష్టం చేశారు.
ఎక్స్ అఫీషియో నిబంధనలపై అయోమయం
ఎన్నికల తర్వాత మేయర్ మరియు చైర్మన్ ఎన్నికల్లో కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల నిబంధనలపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. కలెక్టర్లు ఒక మాట.. చీఫ్ సెక్రటరీ మరో మాట చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు. మేయర్ పీఠాలను దక్కించుకోవడానికి ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఫార్ములా-ఈ విచారణ ఒక తమాషా
ప్రభుత్వం మరోసారి ఫార్ములా-ఈ అంశాన్ని తెరపైకి తేవడం కేవలం కాలక్షేపం కోసమేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు పిలిచి ఏమీ నిరూపించలేకపోయారని.. ఇప్పుడు మళ్ళీ పిలవడం తమాషాగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు పిలిచినా వెళ్లి సత్యాన్ని చెబుతామని.. విచారణలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కేసులో ఎలాంటి పస లేదని అధికారులే ముఖ్యమంత్రికి చెప్పినా.. కేవలం రాజకీయ కక్షతోనే ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. చివరికి జైలుకు పంపినా భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.























