CM Revanth Reddy: రాహుల్ గాంధీ గెలవకపోతే పేదల భూములు, ఆస్తులు కోల్పోతారు- ఢిల్లీలో రేవంత్ రెడ్డి
Congress ramlila maidan rally | కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్, ఖర్గే సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. 'ఓటు దొంగ గద్దె దిగిపో' నినాదంతో ప్రదర్శన నిర్వహించారు.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి సంబంధించి ఒక ప్రకటన చేసి వివాదం రేకెత్తించారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు నిర్వహించిన 'ఓటు చోర్ గద్దీ చోడ్' ర్యాలీలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి రాహుల్ గాంధీని గెలిపించకపోతే ఎన్డీయే ప్రభుత్వం పేదల భూములు, ఆస్తులు కూడా లాగేసుకుంటుందని ఆరోపించారు.
#WATCH | Delhi | Telangana CM Revanth Reddy says, "The country has to bring victory to Rahul Gandhi, otherwise the poor would lose their voting rights. Once their names are removed from the voter list, their Aadhar cards, ration cards, lands and properties will be snatched away.… pic.twitter.com/hrikbXgMAM
— ANI (@ANI) December 14, 2025
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు?
'దేశం కోసం ఈసారి రాహుల్ గాంధీని గెలిపించాలి. లేకపోతే పేదలు ఓటు హక్కును కోల్పోతారు. ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగిస్తే, వారి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, భూములు, ఆస్తులు అన్నీ లాగేసుకుంటారు. ఆదివాసీలు అన్నీ కోల్పోతారు. మనం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ సైనికుల్లా పోరాడాలి' అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాంలీలా మైదానంలో ఖర్గే ఏమన్నారు?
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. నేటి పోరాటం ఒక్క నాయకుడిది కాదు, దేశ రాజ్యాంగం, ఓటు హక్కు, సామాన్య ప్రజల భవిష్యత్తు కోసం అన్నారు. రాహుల్ గాంధీ దేశం, ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడం మనందరి బాధ్యత అన్నారు. ఈ భావజాలాన్ని బలహీనపరిస్తే దేశమంతా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఖర్గే.. ఆర్ఎస్ఎస్, బీజేపీలపై కూడా విమర్శలు గుప్పించారు. ఇది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా నెమ్మదిగా సాగుతోందని, పేదలను తిరిగి బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓటు చోరీకి వ్యతిరేకంగా ఐదు కోట్లకు పైగా సంతకాలు
రాంలీలా మైదానంలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ఓటు దొంగతనంపై సంతకాలతో కూడిన ఐదు కోట్లకు పైగా సంతకాల కాగితాలను వేదికపై ఉంచారు. కోట్లాది ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం అధికారాన్ని హస్తగతం చేసుకుని, ప్రజలపై పెత్తనం చెలాయిస్తుందన్నారు.
ట్రెండింగ్ వార్తలు























