CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Telangana: 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రేవంత్ రెడ్డి పకడ్బందీగాఅమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్చి ఆరు నుంచి చేపట్టాల్సిన పనులపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

CM Revanth gave key instructions in the collectors meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ రాష్ట్ర పాలనలో కీలక మార్పులకు వేదికైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ను సీఎం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఎటువంటి మినహాయింపు లేకుండా అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో క్షేత్రస్థాయిలో పాలనను మరింత పారదర్శకం చేయాలని సూచించారు. గ్రామ సభల వేదికగా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం ప్రయోజనాలను ప్రజలకు విడమర్చి చెప్పాలని, తద్వారా పౌరుల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలపై లబ్ధిదారుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ సేకరించి, ఆ వివరాలను ప్రజల ముందుకు తీసుకురావాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులను వాటికి సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల వనరుల వినియోగం పెరగడమే కాకుండా, స్పెషలిస్ట్ వైద్యుల సేవలు సామాన్యులకు చేరువవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన సంస్కరణల గురించి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు పెండింగ్లో ఉన్న నెలవారీ బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, ఇందులో జాప్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగే 99 రోజుల ప్రత్యేక ప్రణాళికపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి వార్డు మెంబర్ల నుంచి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించి, వారికి కేటాయించిన బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. వికసిత్ తెలంగాణ లక్ష్యంలో భాగంగా ఈ 99 రోజుల ప్రణాళిక ఒక మైలురాయిగా నిలవాలని, జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి గణనీయమైన మార్పులు కనిపించాలని ఆయన లక్ష్యాన్ని నిర్దేశించారు.
సంక్షేమ పథకాల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఫేషియల్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక సాంకేతికతను తప్పనిసరి చేయాలని సీఎం నిర్ణయించారు. దీనివల్ల అనర్హులను తొలగించి, నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని ఆయన ఉదాహరణలతో వివరించారు. అలాగే సోలార్ ఎనర్జీ వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పంప్సెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి రోజూ ఒక లక్ష్యంలా పనిచేస్తూ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ట్రెండింగ్ వార్తలు






















