Breaking News: బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నవంబర్ 30న జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం

Background
తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో డాలర్ శేషాద్రి కన్నుమూశారని సమాచారం. కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో డాలర్ శేషాద్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారికి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఆయన రిటైర్ అయ్యారు. కానీ, ఆయన సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్టీగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆయనకు బాధ్యతలు అప్పగించింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈరోజు 8 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. నేటి ఉదయం కుటుంబసభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఏపీలోని కొండపల్లి మున్సిపాలిటీ ఫలితాలపై నేడు ఉత్కంఠ వీడనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినా ఫలితాలు వెలువడలేదు. ఉద్రిక్తతల నడుమ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక గురువారం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాలను రిజర్వులో ఉంచారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోలను ఎన్నికల అధికారులు సీల్డ్కవర్లో కోర్టుకు పంపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటుపై ఉన్న అభ్యంతరాలపై స్పష్టత రానుంది. ఆయన ఓటు చెల్లితే టీడీపీకి చైర్మన్ పదవికి దక్కుతుంది. చెల్లనిపక్షంలో టాస్ ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో మూడురోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోమరిన్ ప్రాంతం దానిని అనుకుని ఉన్న శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 20 తేదీలోగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నేడు, లేదా రేపటిలోగా ఏర్పడనున్న ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉంది. వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. రెండు అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో నేడు, రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మరుసటి రోజు సైతం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
గుత్తివారిపల్లి పొలాల్లో మరణించిన చిరుత పులి...
చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం గుత్తివారిపల్లి గ్రామం సమీపంలో వ్యవసాయ పొలాల్లో చిరుత పులి మరణించింది. చనిపోయిన చిరుత పులిని గొర్రెల కాపరులు గుర్తించి అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించారు. గత పది రోజుల నుంచి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిరుత పులి చనిపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అటవీ సమీపంలో గ్రామం ఉన్నందున ఆవులు, గొర్రెల కాపరులు పొలాల్లో పని చేస్తున్న రైతులు జాగ్రత్త వహించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్
దేశంలో ఆహార ధాన్యాలు సేకరిచండం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్ నిల్వ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల అనేక రంగాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సిపాయిలా పోరాడాలి కానీ చేతకాని దద్దమ్మాలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ రైతు రాబందు పార్టీ అని విమర్శించారు.





















