Medaram Jatara 2026: మేడారం వెళ్లే భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్షేమంగా ఇంటికి చేరుకుంటారు!
Sammakka Sarakka Jatara 2026: జనవరి ఆఖర్లో జరగనున్న మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. వనదేవతల దర్శనార్థం ముందుగానే భక్తులు బారులు తీరుతున్నారు. మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

Medaram Sammakka Sarakka Jatara 2026: మేడారం జాతరలో సమ్మక్క,సారలమ్మను దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని భక్తుల విశ్వాసం. రెండేళ్లకోసారి జరిగే జాతరకు తెలంగాణ సహా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తి సంగతి సరే..కొన్ని జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, జంపన్నవాగులో స్నానాలు ఆచరించే భక్తులు కొందరు నీట మునిగిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయ్. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ఎంత క్షేమంగా జాతరకు వెళ్లారో..అంతే క్షేమంగా ఇంటికి తిరిగివెళ్లాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
బంగారం ఆభరణాలు ధరించకపోవడమే మంచిది
సాధారణంగా దైవదర్శనాలకు వెళ్లే భక్తులు ముఖ్యంగా మహిళలు పట్టుచీరలు, బంగారు ఆభరణాలు ధరిస్తారు. పట్టుచీరల వరకూ సరే కానీ అత్యంత రద్దీగా ఉండే జాతరకు బంగారు ఆభరణాలు ధరించి వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే జాతర జరిగే నాలుగు రోజుల్లో కోట్ల మంది భక్తులు గుమిగూడుతారు. ఇంత మంది కిక్కిరిసే జాతరలో దొంగతనాలు కూడా అదే స్థాయిలో జరుగుతాయి. అంతరాష్ట్ర ముఠాలకు అడ్డాగా మారే ప్రదేశం కూడా ఇదే. అందుకే వీలైనంతవరకూ బంగారు ఆభరణాలు ధరించడం కానీ తీసుకెళ్లడం కానీ చేయకపోవడమే మంచిది. పర్సులు, ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చుట్టుపక్కల ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే మీకు సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి
జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించండి కానీ...
జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానం ఆచరించిన తర్వాత గద్దెలపై కొలువైన అమ్మవార్లను దర్శించుకుంటారు. జంపన్నవాగు మూడు అడుగుల లోతులోనే ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రవాహ వేగాన్ని నిలువరించేందుకు ఇసుకబస్తాలతో కట్టలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు ఇబ్బందిపడకుండా స్నానఘట్టాలపై షవర్లు ఏర్పాటు చేశారు. అధికారులు చేసిన ఏర్పాట్లను వినియోగించుకోండి.. చిన్నారులు, వృద్ధుల ప్రాణాలను రిస్క్ లో పెట్టకండి
చిన్నారుల చేయి వదలకండి
అప్పటివరకూ చేయి పట్టుకున్నట్టే ఉంటారు అంతలోనే మాయమైపోతారు చిన్నారులు. గట్టిగా అరిచినా, ఏడ్చినా వినిపించుకునే అవకాశం కూడా ఉండదు. అంత రద్దీలో మళ్లీ ఆ చిన్నారులు తల్లిదండ్రులను చేరేవరకూ ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. గతేడాది జాతరలో దాదాపు 30 వేలమంది తప్పిపోయి తిరిగి తమవారిని చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. ఈసారి జాతరలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్ వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రోన్ వ్యవస్థను, జియో ట్యాగింగ్ ట్రాకింగ్ సిస్టంతో పాటూ 13 వేలమంది పోలీసు సిబ్బంది, 12 క్రైమ్ డికెక్షన్ బృందాలు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా కానీ..మీ చిన్నారుల భద్రత భాద్యత మొదటగా మీదే అని గుర్తుంచుకోండి. తప్పిపోతే వెంటనే హెల్ప్ డెస్క్ దగ్గరకు వెళ్లి సహాయం కోరండి. కుటుంబ సభ్యులంతా బృందంగానే వెళ్లాలి
వేగం ప్రమాదం..
భగవంతుడి దర్శనానికే కదా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని వేగంగా దూసుకెళ్లకండి. మీరు ఎక్కడికి వెళుతున్నా వేగం ప్రమాదమే. పైగా దారులన్నీ మేడారం వైపే కావడంతో వాహనాల రద్దీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. డ్రైవర్ మద్యం తాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని గుర్తుపెట్టుకోండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ భద్రతకోసం ముందస్తు సూచన మాత్రమే..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
























