YS Jagan: కేంద్రం పెంచిన పెట్రో రేట్లపై వైసీపీ ఆందోళనలు - కానీ బీజేపీపై విమర్శలు నిల్ - జగన్ ప్లాన్ అదేనా?
YSRCP: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజకీయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేంద్రం చేతుల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ భారీ నిరసనలు చేపట్టింది. బీజేపీని ఢీకొట్టబోతున్నామన్న సంకేతాలు పంపింది.

YSRCP Vs BJP: రాజకీయాల్లో ఏ చర్య వెనుకైనా ఒక బలమైన వ్యూహం, ఆశించిన లక్ష్యం ఉంటాయి. ఏపీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై చేపట్టిన నిరసనలు ఈ కోవలోకే వస్తాయి. రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సమస్యలపై పెద్దగా గళమెత్తని వైసీపీ, ఒక్కసారిగా పెట్రోల్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభఇప్రాయం వినిపిస్తోంది. పెట్రోల్ ధరల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ.. వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా ప్రధాని మోదీని గానీ, కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని గానీ విమర్శించడం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అడ్రస్ కేంద్రానిది అయితే, దాన్ని రాష్ట్రం మీదకు మళ్లించడం వెనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ ఉన్నట్లు భావిస్తున్నారు.
వైసీపీ ఇస్తున్న ఈ సిగ్నల్స్ వెనుక ప్రధాన ఉద్దేశం.. తాము కేంద్రానికి వ్యతిరేకం కాదని, కానీ అవసరమైతే తమ దారి తాము చూసుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగల సత్తా తమకు ఉందని నిరూపించడమే . ఢిల్లీ స్థాయిలో బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ-జనసేన కూటమిని ఇరుకున పెట్టడం ఈ వ్యూహంలోని ప్రధాన భాగం. మేము కేంద్రాన్ని ఏమీ అనడం లేదు, కానీ మీరు తగ్గించొచ్చు కదా అనే ప్రశ్న ద్వారా ప్రజల్లో అధికార కూటమిపై వ్యతిరేకత పెంచడమే వైసీపీ లక్ష్యం. ఇది బీజేపీకి పంపుతున్న ఒక రకమైన సాఫ్ట్ సిగ్నల్ .
ఎందుకు ఈ వ్యూహం?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు వరుసగా కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం అండ ఉంటేనే తాము సురక్షితంగా ఉంటామని వైసీపీ భావిస్తోంది. అందుకే డైరెక్ట్ గా కేంద్రంతో యుద్ధం పెట్టుకోకుండా.. రాష్ట్రానికి సంబంధించిన సెస్, వాట్ అంశాలను సాకుగా చూపిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఇలా చేయడం వల్ల కేంద్రానికి కోపం రాదు, అదే సమయంలో రాష్ట్రంలో తాము ప్రతిపక్షంగా యాక్టివ్ గా ఉన్నామనే సంకేతం కేడర్ కు వెళ్తుంది.
డైరెక్ట్ ఎటాక్ ఎందుకు చేయడం లేదు?
ఒకవేళ మోదీపై నేరుగా విమర్శలు చేస్తే, సంబంధాలు దెబ్బతింటాయి. భవిష్యత్తులో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడం కష్టమవుతుందని వైసీపీకి తెలుసు. అందుకే, నిరసనల నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పన్నుల వైపు మళ్లించారని అంచున్నారు. పెట్రోల్ ధరల్లో ఏపీ నంబర్ వన్ అని ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చేలా చేస్తున్నారు తప్ప, ధరలు పెంచిన కేంద్రానికి ఏమీ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. వైసీపీ చేస్తున్న ఈ పెట్రోల్ నిరసనలు కేవలం ధరల కోసమే అని అనుకుంటే పొరపాటే. ఇది పక్కాగా ఢిల్లీ పెద్దల మనసు గెలుచుకుంటూనే, గల్లీలో ఉన్న ప్రత్యర్థులను దెబ్బకొట్టే డబుల్ యాక్షన్ ప్లాన్. కేంద్రం పట్ల మౌనం పాటిస్తూ, రాష్ట్రంపై గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న ఈ రాజకీయ చాణక్యం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















