YS Jagan Supporting Accused: జగన్ పొలిటికల్ వ్యూహం రివర్స్? లిక్కర్ స్కామ్లో సైలెన్స్.. ఆ నిందితులకు భరోసా! ఎందుకలా?
YSRCP Cadre Assurance Strategy: ఏపీలో వైఎస్ జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం భిన్నంగా ఉంది. తెనాలి, విజయవాడ ఘటనల్లో నేరస్తులకు మద్దతుగా నిలిచారు. జైలుకెళ్లిన పార్టీ నేతల్ని పట్టించుకో లేదు.

AP Alliance Govt Vs YSRCP Case Sheet: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ భిన్నంగా, చర్చనీయాంశంగా ఉంటాయి. అయితే, ఇటీవల ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఇస్తున్న పొలిటికల్ సపోర్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, సోషల్ మీడియా వేదికలపై తీవ్ర చర్చకు దారితీసింది.
లిక్కర్ స్కామ్లో సైలెన్స్..
ఏపీ లిక్కర్ స్కాంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, జగన్ సన్నిహితులు అరెస్టు అవుతున్నారు. ఈ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన పార్టీ నేతల్ని జగన్ పట్టించుకోలేదు. జైలుకెళ్లి పరామర్శించలేదు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వంటి అత్యంత సన్నిహితులు అరెస్టు అయి రోజుల తరబడి జైల్లో ఉన్నా ఆయన పరామర్శించలేదు. పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో సదరు నేతలను వెనకేసుకురావడానికి ఆయన అప్పట్లో ఇష్టపడలేదని వైసీపీ వర్గాలు చెబుతుతున్నాయి. కానీ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసు రికార్డుల్లో నమోదైన వ్యక్తుల ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లడం లేదా వారికి పార్టీ తరపున లీగల్ సపోర్ట్ ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది.
వైసీపీ ఇమేజ్పై పడుతున్న ప్రతికూల ముద్ర..
రాజకీయంగా ఈ పరిణామం వైసీపీ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని లేదా క్రిమినల్ రికార్డులు ఉన్నవారిని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ, జగన్ స్వయంగా నిందితుల పక్షాన నిలబడుతున్నట్లు కనిపించడం వల్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న వైసీపీ రౌడీయిజం, ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తోంది అనే ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. తటస్థ ఓటర్లు , ముఖ్యంగా మహిళా ఓటర్లు ఈ విధమైన రాజకీయాల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తారని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
జగన్ రాజకీయం..జగన్దే
సొంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలిసినా జగన్ ఎందుకు వెనక్కు తగ్గడం లేదు? దీని వెనుక బలమైన క్యాడర్ సెంటిమెంట్ వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే పొలిటికల్ విక్టిమ్ కార్డ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. నిందితుల నేర చరిత్ర కంటే.. వారిపై బనాయిస్తున్నా కేసులు రాజకీయ ప్రేరేపితమైనవే అని చూపించడం ద్వారా సానుభూతి సంపాదించాలనేది వైసీపీ వ్యూహం. అందుకే తెనాలి, విజయవాడ ఘటనల్లోని వ్యక్తుల రికార్డులను పక్కనబెట్టి, ప్రభుత్వం వారిని వేధిస్తోందనే కోణంలోనే జగన్ ప్రచారం చేస్తున్నారు.
జాతీయ స్థాయి వర్సెస్ క్షేత్రస్థాయి రాజకీయం!
లిక్కర్ స్కామ్ వంటి వ్యవహారాలు జాతీయ స్థాయి ఇమేజ్, దర్యాప్తు సంస్థల పరిధిలో ఉంటాయి. ఇప్పటికే ఈ కేసులో ఈడీ దూకుడుగా ఉంది. అక్కడ జోక్యం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో నేరుగా విభేదించాల్సి వస్తుంది. పైగా అది అవినీతికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రజల్లో సానుభూతి రాదు. కానీ, స్థానిక ఘర్షణలు కేవలం రాష్ట్ర పరిధిలోనివి. క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటుకోవడానికి, నిరంతరం వార్తల్లో ఉండటానికి మరియు కూటమి ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ వైఫల్యాలను ఎండగట్టడానికి ఈ చిన్న ఘటనలైనా జగన్కు పొలిటికల్ వెపన్స్లా ఉపయోగపడుతున్నాయి.
రన్ రేస్లో ఈ వ్యూహం ఫలిస్తుందా ?
కార్యకర్తలకు భరోసా ఇవ్వడం పార్టీని బ్రతికించుకోవడానికి తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు కానీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని వెనకేసుకురావడం దీర్ఘకాలంలో వైసీపీకి పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలలో శాంతిభద్రతల అంశం కూడా ఒకటి. ఇప్పుడు మళ్లీ అదే తరహా ముద్ర పడితే, భవిష్యత్తులో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కష్టతరంగా మారుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















