అన్వేషించండి
Telangana Latest News: 'వారందర్నీ తప్పించేయండీ' మహేష్ గౌడ్కు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం! అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్!
Telangana Latest News: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ వ్యూహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.

'వారందర్నీ తప్పించేయండీ' మహేష్ గౌడ్కు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం! అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్!
Source : Social Media
Telangana Latest News: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి వరుసగా సాధిస్తున్న రాజకీయ విజయాలు, పాలనాపరమైన సంస్కరలపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఏఐసీసీ అగ్రనాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రుల బృందం గురువారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగావచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టినట్టు స్పష్టం చేసింది. పదివేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన వారిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించారు.
విజయాలపై సమీక్ష, అధిష్ఠానం ప్రశంసలు
తెలంగాణలో గత రెండేళ్లలో పార్టీ సాధిస్తున్న పురోగతిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడిని ధిల్లీకి పిలిపించిన అధిష్ఠానం, దాదాపు రెండు గంటలపాటు లోతైన చర్చలు జరిపింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మొదలు కొని ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు కాంగ్రెస్ సాధించిన ఫలితాల పట్ల మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 80 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఆస్వాదిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని ఖర్గే కొనియాడారు. ఇప్పటి వరకు అన్ని సానుకూలంగా సాగాయని, భవిష్యత్లో కూడా ఇదే పట్టుదలతో మంచి ఫలితాలు సాధించాలని నాయకత్వానికి సూచించారు.
శాఖలవారీగా పాలనా పురోగతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే మంత్రులు తమ శాఖల పనితీరును, అమలు చేస్తున్న కీలక పథకాలను అధిష్ఠానానికి వివరించారు. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించిన తీరును మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదిక ఇచ్చారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, భూభారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన భూసర్వే వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం, దాని వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. గిగ్ వర్కర్స్ కోసం ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విధానం గురించి మంత్రి వివేక్ వివరించగా, ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని రాహుల్ సూచించారు.
సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు
తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన సమ్మక్క- సారలమ్మ జాతర నిర్వహణపై రాహుల్ గాంధీ ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఈ జాతర చరిత్ర, ప్రభుత్వం అక్కడ చేపట్టిన కొత్త నిర్మాణాల గురించి తెలుసుకున్న ఆయన, సమ్మక్క-సారలమ్మపై జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఒక సినిమా తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. జాత విజయవంతం కావడంపై అభినందిస్తూ తనను కూడా ఆహ్వానించి ఉంటే వచ్చే వాళ్లమని అన్నారు.
రాజకీయ వ్యూహాలపై చర్చ
పాలనతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా ఢిల్లీ వేదికగా చర్చ జరిగింది. ఇటీవల ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై అధిష్ఠానం ఆరా తీసింది. త్వరలోనే ఆయనను ఢిల్లీకి పిలిపించి మాట్లాడతామని అగ్రనేతలు అన్నట్టు తెలుస్తోంది. అలాగే రాజ్యసభ ఎన్నికల అంశంపై మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్తో విడిగా చర్చించనున్నారు.
పార్టీని బలోపేతం చేసే క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పదివేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులను మార్చాలని హైకమాండ్ ఆదేశించింది. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ స్థానాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రశ్నించగా, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఇచ్చిన వివరణ పట్ల వారు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన మంత్రులు
రాష్ట్ర మంత్రివర్గమంతా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఫామ్హౌస్ నుంచి పాలన చేయడం తప్పని, జాతీయ పార్టీ నాయకత్వానికి కలవడం ఎలా తప్పు అవుతుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ దిల్లీలో పార్టీ కార్యాలయం ఎందుకు నిర్మించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల్లో అత్యధికం ఇప్పటికే అమలు చేస్తున్నామని, కేసీఆర్లా తాము ప్రజలను వదిలేసి పోయే రకం కాదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
భవిష్యత్తు కార్యాచరణ- నామినేటెడ్ పదవులు
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మార్చి రెండో వారానికిల్లా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన పీసీసీ కార్యవర్గ పోస్టులు, జిల్లా, బ్లాక్ కమిటీలను కూడా అదే గడువులోగా భర్తీ చేస్తామని మహేష్ కుమారు గౌడ్ వెల్లడించారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పని చేయడం వల్లే స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు వచ్చాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వివరించారు.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
Advertisement























