Telangana Congress internal democracy: తెలంగాణ కాంగ్రెస్లో గీత దాటిపోతున్న అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ పట్టు పైపైనే కనిపిస్తోందా?
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో నేతల అంతర్గత రాజకీయాలు చిచ్చు పెడుతున్నాయి. ఒకరినొకరు కించపర్చుకుంటూ చిట్ చాట్లు చేస్తున్నారు. దానికి అంతర్గత ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకుంటున్నారు.

Internal politics of the leaders in the Telangana Congress are causing chaos: తెలంగాణ కాంగ్రెస్లో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నప్పటికీ, పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం ఇప్పుడు అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
హస్తం పార్టీలో చీఫ్ పంచాయితీ
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో పెను దుమారాన్ని రేపాయి. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మాస్ లీడర్ కాదని, ఆయన స్థానంలో జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేశాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన 99-రోజుల యాక్షన్ ప్లాన్ అమల్లో బిజీగా ఉంటే, కేబినెట్ మంత్రే పీసీసీ మార్పు గురించి బహిరంగంగా మాట్లాడటం రేవంత్ టీమ్ను ఆత్మరక్షణలో పడేసింది.
బీసీ నేతల ఆగ్రహం - సామాజిక సమీకరణాలు
మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో, కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రవర్ణ వర్సెస్ బీసీ వివాదానికి దారితీశాయి. బీసీ నేత నాయకత్వాన్ని తక్కువ చేయడం అంటే పార్టీ సాధించిన విజయాలను అవమానించడమే అని పలువురు బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం మహేష్ గౌడ్ నాయకత్వంలోనే కదా అని వారు నిలదీస్తున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరకు ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దల వరకు చేరింది.
ఎమ్మెల్యేల లాబీ చిట్ చాట్లు - రచ్చరచ్చ
అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులతో చేస్తున్న ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్లు ఇప్పుడు పార్టీకి పెద్ద శాపంగా మారాయి. మంత్రి పదవుల ఆశావహులు, అసంతృప్త నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ప్రభుత్వంపైనే సెటైర్లు వేయడం వంటివి పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి, మీడియా ఇంటరాక్షన్లలో జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హెచ్చరించినా, ఎమ్మెల్యేలు మాత్రం తమ స్వేచ్ఛా ధోరణిని వీడటం లేదు. ఈ అలవోక మాటలే ప్రత్యర్థి పార్టీలకు బలమైన అస్త్రాలుగా మారుతున్నాయి.
రేవంత్ రెడ్డి పట్టుకు సవాళ్లు
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన పరిపాలనా దక్షతను నిరూపించుకుంటూ, హైకమాండ్ వద్ద తన పలుకుబడిని పెంచుకుంటున్నప్పటికీ, పార్టీలోని సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వెనక్కి తగ్గిన కోమటిరెడ్డి, తన మాటల వెనుక దురుద్దేశం లేదని, జగ్గారెడ్డిని పొగిడానే తప్ప మహేష్ గౌడ్ను కించపరచలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, కాంగ్రెస్లో ఈ బహిరంగ విమర్శల సంస్కృతి పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తోందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తంమ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండటం మంచిదే అయినప్పటికీ, అది హద్దులు దాటితే ప్రభుత్వ మనుగడకే ప్రమాదమని క్యాడర్ ఆందోళన చెందుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉటుందన్న ప్రచారంతో ఇది మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
























