Telangana assembly meetings: అసెంబ్లీలో వార్ వన్ సైడ్ - కేసీఆర్ లేని లోటు - రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!
Telangana: తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకపోవడం బీఆర్ఎస్ పార్టీకి సమస్యగా మారింది. రేవంత్ ను ఎదుర్కోవడం కేటీఆర్ అండ్ టీంకు సమస్యగా మారుతోంది.

KTR unable to contest against Revanth in Telangana Assembly sessions: తెలంగాణ శాసనసభలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర యుద్ధానికి వేదికవుతున్నాయి. అయితే, ఈ పోరాటంలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గైర్హాజరీ ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది. కేసీఆర్ సభకు రాకపోవడంతో అధికార పక్షం సంధిస్తున్న విమర్శనాస్త్రాలను తిప్పికొట్టడంలో గులాబీ దళం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తుండటంతో అసెంబ్లీలో పరిస్థితి వార్ వన్ సైడ్ అన్నట్లుగా మారుతోంది.
తేలిపోతున్న ప్రతిపక్ష పోరాటం
శాసనసభలో బీఆర్ఎస్ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గళం విప్పుతున్నప్పటికీ, కేసీఆర్ మార్క్ వ్యూహచతురత లోపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన బడ్జెట్ చర్చలు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వంటి సందర్భాల్లో కేసీఆర్ ఉండి ఉంటే సభలో చర్చ మరో స్థాయిలో ఉండేది. కేసీఆర్ లేని లోటును రేవంత్ రెడ్డి అనుకూలంగా మార్చుకుంటున్నారు. "ప్రజలు అధికారం ఇచ్చినా బాధ్యతగా సభకు రాని నేత అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేస్తున్న దాడులు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.
కేటీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు
అసెంబ్లీలో కేటీఆర్ చేస్తున్న కొన్ని సవాళ్లు, విమర్శలు అనూహ్యంగా ప్రభుత్వానికే మేలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై కేటీఆర్ దూకుడుగా విమర్శిస్తున్న సమయంలో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో బయటపెడుతోంది. కేటీఆర్ వేసే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేస్తూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోపాలను ఎండగడుతున్నారు. దీంతో చర్చ బీఆర్ఎస్ అనుకూలంగా ఉండాల్సింది పోయి, తిరిగి వారి పాత పాలనపై విమర్శలకే పరిమితమవుతోంది.
వ్యూహాత్మక అస్త్రంగా కేసీఆర్ గైర్హాజరీ
కేసీఆర్ సభకు రాకపోవడాన్ని కాంగ్రెస్ ఒక బలమైన రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. కేసీఆర్ జీతం, అలవెన్సుల రూపంలో కోటి రూపాయలకు పైగా ప్రజాధనాన్ని పొందుతున్నారని, కానీ సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శిస్తున్నారు. రాజరిక ధోరణులు ఇంకా పోలేదు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ క్యాడర్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
బీఆర్ఎస్ అసెంబ్లీ పోరాటానికి మళ్లీ ఆ పాత ఊపు రావాలంటే కేసీఆర్ సభలో అడుగుపెట్టడం ఒక్కటే మార్గమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
రేవంత్కు కేసీఆరే కరెక్ట్
రేవంత్ రెడ్డి వంటి వాగ్ధాటి కలిగిన నేతను ఢీకొనాలన్నా, సభలో చర్చను తమ అజెండా వైపు తిప్పుకోవాలన్నా కేసీఆర్ అనుభవం పార్టీకి అత్యవసరం. కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప, అసెంబ్లీలో కాంగ్రెస్ ఏకపక్ష దూకుడుకు అడ్డుకట్ట వేయడం కేటీఆర్, హరీష్ రావులకు కష్టతరంగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి హవా కొనసాగుతుండగా, బీఆర్ఎస్ పట్టుకోసం పరితపిస్తోంది.
























