(Source: Poll of Polls)
Tamil Nadu Politics: తమిళనాడు అంచనాలకు అందని ఆర్డర్ - ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ.. విజయ్ ఎక్స్ ఫ్యాక్టర్!
Tamil Nadu : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక పట్టాన ఎవరికీ అర్థం కావు. 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.

Tamil Nadu Exit polls Vijay X Factor: తమిళనాడు ఓటరు నాడి పట్టుకోవడం సర్వే సంస్థలకు ఈసారి కత్తిమీద సాములా మారింది. బుధవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే.. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా త్రిముఖ పోటీ నెలకొందని స్పష్టమవుతోంది. గత ఐదు దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల చుట్టూ తిరిగిన రాజకీయం, ఈసారి విజయ్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. Axis My India వంటి సంస్థలు విజయ్ పార్టీకి ఏకంగా 120 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని, ఆయన కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని జోస్యం చెప్పడం తమిళనాడు రాజకీయాల్లో భూకంపం సృష్టించింది.
సంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే , అన్నాడీఎంకేల బలాబలాల విషయంలో కూడా సర్వేలు భిన్నమైన గొంతుకలను వినిపించాయి. JVC , Vote Vibe వంటి సంస్థలు ఈసారి అన్నాడీఎంకే అఖండ విజయం సాధించి, 120 నుంచి 140 సీట్లతో అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా, P-Marq, Matrize వంటి సంస్థలు మళ్ళీ డీఎంకే కే పట్టం కట్టాయి. ఇలా ప్రతి సంస్థా ఒక్కో పార్టీకి మెజారిటీ ఇవ్వడం చూస్తుంటే, క్షేత్రస్థాయిలో ఓటరు తీర్పు ఎంత నిగూఢంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈసారి నమోదైన రికార్డు స్థాయి 85.1% ఓటింగ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో భారీగా ఓటింగ్ శాతం పెరిగినప్పుడు అధికార వ్యతిరేకత పనిచేసి ప్రభుత్వం మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈసారి పెరిగిన ఓటింగ్ కేవలం ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనా? లేక విజయ్ పట్ల యువతలో ఉన్న క్రేజ్ ఓట్లను పోలింగ్ బూత్ల వరకు రప్పించిందా? అన్నది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఉత్తర , మధ్య తమిళనాడులో విజయ్ పార్టీ డీఎంకే ఓట్లను భారీగా చీల్చినట్లు, పశ్చిమ తమిళనాడులో అన్నాడీఎంకేకు గట్టి పోటీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
తమిళనాడు ఓటర్లు ఎప్పుడూ వేవ్ తరహాలో తీర్పు ఇస్తారు. కానీ, ఈసారి ఏకాభిప్రాయం లేకపోవడం చూస్తుంటే రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. డీఎంకే తన సంక్షేమ పథకాలపై భరోసా పెట్టుకోగా, అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను నమ్ముకుంది. అయితే, ఈ ఇద్దరి మధ్య విజయ్ పార్టీ 20% కంటే ఎక్కువ ఓటు షేర్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం వల్ల, గెలుపు ఓటముల సమీకరణాలు పూర్తిగా తలకిందులయ్యే అవకాశం ఉంది.
తమిళనాడు రాజకీయ చిత్రపటంలో మే 4వ తేదీన వెలువడే ఫలితాలు ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తున్నా, తమిళనాడులో మాత్రం ఉత్కంఠ చివరి నిమిషం వరకు కొనసాగేలా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై విజయ్ చక్రం తిప్పుతారా? లేక ద్రవిడ దిగ్గజాలే మళ్ళీ పైచేయి సాధిస్తారా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా, ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలకబోతున్నాయన్నది మాత్రం అక్షర సత్యం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















