(Source: Poll of Polls)
Kerala Exit polls: కేరళలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పేది ఒక్కటే - లెఫ్ట్ పార్టీలకు ఎగ్జిట్ - కాంగ్రెస్ కూటమికి పీఠం !
Kerala: కేరళలో ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదే చెప్పాయి.

Kerala exit for Left parties: కేరళలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. కేరళ రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా ఉన్న ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది అనే ఆచారాన్ని 2021లో ఎల్డీఎఫ్ (LDF) బ్రేక్ చేసింది. అయితే, 2026లో మళ్ళీ పాత సంప్రదాయమే పునరావృతం కాబోతోందని, ఈసారి యూడీఎఫ్ (UDF) అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి.
మళ్ళీ మార్పు దిశగా కేరళ ఓటరు!
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71 . దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని అర్థమవుతోంది. Axis My India యూడీఎఫ్కు అత్యధికంగా 78-90 స్థానాలు అంచనా వేయగా, People's Pulse 75-85 స్థానాలు, Vote Vibe 70-80 స్థానాలు, Matrize 70-75 స్థానాలు లభిస్తాయని పేర్కొన్నాయి. మరోవైపు, అధికార ఎల్డీఎఫ్ (LDF) 49 నుండి 68 స్థానాల మధ్యే పరిమితం కావచ్చని ఈ సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమికి అత్యల్పంగా 0 నుండి 5 స్థానాల లోపే దక్కవచ్చని, ఇతరులు ఒకటి రెండు స్థానాలకే పరిమితమవుతారని ఈ అంచనాలు సూచిస్తున్నాయి. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ 71ని దాటి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఆకర్షించిన కాంగ్రెస్ హామీలు
వి.డి. సతీశన్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమికి ఈసారి ప్రజలు పట్టం కట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు , ప్రభుత్వ వ్యతిరేకత యూడీఎఫ్ కు బాగా కలిసివచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా మూడవసారి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన పినరయి విజయన్ కు ఈ ఫలితాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టిన కె-రైల్ వంటి ప్రాజెక్టులపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు కూటమి సీట్లను తగ్గించాయని అంచనా. కేరళలో ఈసారి రికార్డు స్థాయిలో 81.2% మహిళా ఓటింగ్ నమోదైంది. మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి యూడీఎఫ్ వాగ్దానాలు వారిని ఆకర్షించినట్లు కనిపిస్తోంది.
బీజేపీ ఉనికి అంతంతమాత్రమే
రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో బీజేపీ (NDA) ఈసారి కేరళలో తన ఖాతాను పెంచుకోవాలని గట్టిగానే ప్రయత్నించింది. కొన్ని సర్వేలు 3 నుండి 5 సీట్లు రావచ్చని చెబుతుండగా, మరికొన్ని మాత్రం కేవలం ఒక్క సీటుకే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నాయి.
కేరళ ఓటర్లు ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తారు. 2021లో ఎల్డీఎఫ్ ను గెలిపించి చరిత్ర సృష్టించిన ప్రజలు, ఈసారి మళ్ళీ యూడీఎఫ్ కు అవకాశం ఇస్తారా లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లెఫ్ట్ పార్టీలకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారా అనేది మే 4 న తేలిపోనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















